అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ..........
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి
నెహ్రూనగర్ (గుంటూరు) : అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కన్నెర్ర చేశారు. అరండల్పేటలోని తన కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని తన సొంత జాగీరులా పరిపాలిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కూడా నిస్సిగ్గుగా అసెంబ్లీ పవిత్రతను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు తన ప్రైవేటు కంపెనీలా నడుపుతున్నారన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కే దుస్సాహసానికి ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే వాటికి బదులివ్వకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తున్న తీరుతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే బలం లేదన్న సంగతి తమకు తెలుసునని, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేసే ఉద్దేశంతోనే తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు.
విజ్ఞులైన ప్రజలు వాస్తవాన్ని నిశితంగా గమనిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విఘాతం కలిగిస్తుందని విరుచుకుపడ్డారు. అధికార బలంతో అసెంబ్లీ నియమ నిబంధనలను సైతం పాలకులు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన తీరు తెన్నులను చూసి న్యాయ వ్యవస్థ సైతం నివ్వెరపోతోందన్నారు.