
ఆధార్ కోసం పడిగాపులు
ఆధార్ కార్డు కోసం పాట్లు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం తుది గడువు సమీపిస్తుండటంతో.. తెల్లవారుజాము నుంచే నమోదు కేంద్రాల వద్ద పిల్లా పాపలతో జనం బారులు తీరుతున్నారు.
విశాఖపట్నం: ఆధార్ కార్డు కోసం పాట్లు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం తుది గడువు సమీపిస్తుండటంతో.. తెల్లవారుజాము నుంచే నమోదు కేంద్రాల వద్ద పిల్లా పాపలతో జనం బారులు తీరుతున్నారు. ద్వారకానగర్లోని కార్వే కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఆధార్ నమోదు కోసం జనం ఎగబడ్డారు. సంస్థ కార్యాలయం నుంచి బుధిల్ పార్కు రోడ్ వరకు క్యూలో పడిగాపులు కాశారు. వారిని అదుపు చేయడానికి సంస్థ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. నగరంలో దరఖాస్తు చేసుకుంటే త్వరగా ఆధార్ కార్డు వస్తుందని అరకు ప్రాంతం నుంచి 38 మంది గిరిజనులు బుధవారం ఇక్కడికి వచ్చారు. గడువులోగా ఆధార్ సమర్పించకుంటే ఎక్కడ ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
అరకు నుంచి వచ్చాం..
ఆధార్ కార్డు కోసం తెల్లవారు జామున అరకు నుంచి వచ్చాం. మా ఊరిలో అయితే చాలా లేటవుతుంది. టౌన్లో వేగంగా ఇస్తారని తెలిసి చంటిపిల్లతో వచ్చాం. ఇక్కడ చూస్తే పెద్ద లైను ఉంది. టోకెన్ తీసుకుని మళ్లీ రావాలంట.
-వంతల సుమని, అరకు
ఏడు పదుల వయసులోనూ..
నా వయసు 75 సంవత్సరాలు, వృద్ధాప్య పింఛన్ కోసం ఆధార్ అవసరమంటున్నారు. ఉదయం 7 నుంచి క్యూలో నిలబడి ఉన్నాను. టైము పదయింది. నా లాంటి వయసు మీరిన వారికి ఆధార్ నమోదులో వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది.
-కె.పైడమ్మ, మర్రిపాలెం
మా అబ్బాయికి రాలేదు
ఆధార్ కార్డు కోసం గాజువాకలో రెండు సార్లు దరఖాస్తు చేశాను. నాకు, నా భార్యకు ఆధార్ వచ్చింది. నా కొడుక్కి రాలేదు. అందుకని ఇక్కడికి ఉదయాన్నే వచ్చాను. ఈ రోజు నా పని, మా అబ్బాయి స్కూల్ రెండూ మానుకున్నాం.
-కె.శ్రీను, కార్పెంటర్, గాజువాక