కొంప ముంచిన సర్కార్ విత్తనాలు! | Sarkar seeds are soaked quite correct! | Sakshi
Sakshi News home page

కొంప ముంచిన సర్కార్ విత్తనాలు!

Oct 23 2014 3:27 AM | Updated on Oct 1 2018 2:03 PM

కొంప ముంచిన సర్కార్ విత్తనాలు! - Sakshi

కొంప ముంచిన సర్కార్ విత్తనాలు!

ప్రభుత్వం ఈ దఫా రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు నట్టేట ముం చేశాయి. కరువుకు తట్టుకోలేని, నాణ్యత లేని కే-6 విత్తనాలను పంపిణీ చేసింది.

  • ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం
  •  కరువుకు తట్టుకోని కే-6 రకం
  •  ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు
  •  ఈ రకాన్నే పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగేది కాదు
  • పలమనేరు: ప్రభుత్వం ఈ దఫా రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు నట్టేట ముం చేశాయి. కరువుకు తట్టుకోలేని, నాణ్యత లేని కే-6 విత్తనాలను పంపిణీ చేసింది. వర్షాభావ పరిస్థితులను ఈ రకం తట్టుకోలేక పంట పూర్తిగా దెబ్బతింది. ఇదే సీజన్‌లో ఆత్మ వారి సౌజన్యంతో ధరణి అనే రకాన్ని కొందరు రైతులకు పంపిణీ చేశారు. కే-6 రకం ఎకరా కు ఓ బస్తా దిగుబడిని ఇవ్వగా, ధరణి రకం పది బస్తా ల దిగుబడినిచ్చింది.

    ఇదే విత్తనాలను రైతులకు పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశెనగ రైతులు నష్టాలపాలయ్యారు. పలమనేరు వ్యవసాయశాఖ సబ్ డివిజ న్‌కు సంబంధించి ఖరీఫ్ సీజన్‌లో 16 వేల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయగా 11,540 హెక్టార్లలో ప్రభుత్వం అందజేసిన విత్తనాలనే వేశారు. మిగిలిన విస్తీర్ణంలో రైతులు వారి సొంత విత్తనాలనే వేసుకున్నారు.
     
    నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోలేదు..

    ఈ దఫా జిల్లాకు ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి-6 అనే రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాల నుంచి వీటిని తెప్పించింది. మామూలుగా 100 గ్రాముల విత్తన కాయలను వొలిస్తే  గింజలు 70 గ్రాముల బరువు వస్తేనే అవి నాణ్యంగా ఉన్నట్టు లెక్క. సీడ్ జర్మినేషన్ 70 శాతంగా ఉండాలని నిబంధనలున్నాయి. చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షిం చాల్సి ఉంది. ఈ దఫా ఇది జరగలేదు.
     
    ఈ ప్రాంతానికి కే-6 పనికిరాదు..

    వర్షాభావానికి తట్టుకోని కే-6 ఈ ప్రాంతానికి సరిపోదు. గతంలోనూ ఈ సమస్య కారణంగానే ఈ రకాన్ని పంపిణీ చేయలేదు. తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. గతేడాది సైతం ఈ రకం విత్తనాలు వేసిన రైతులకు సగం పంట కూడా చేతికందలేదు. ఫలితంగా ఈ దఫా ఎకరాకు బస్తా (40 కేజీలు) కూడా దిగుబడి రాలేదు.
     
    ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు..

    కుప్పం ఆత్మ విభాగం తరఫున అక్కడి అధికారులు కొందరు రైతులకు ధరణి రకం వేరుశెనగ విత్తనాలను ప్రయోగాత్మకంగా పంపిణీ చేశారు. కుప్పం మండలంలోని పీబీ నత్తంలో శ్రీరాములు పొలంలో ప్రయోగాలను చేపట్టారు. కరువు పరిస్థితుల మధ్య ఎకరాకు పది బస్తాల దిగుబడి వచ్చింది. దీన్ని చూసి వ్యవసాయ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదే రకాన్ని జిల్లాలోని అందరు రైతులకూ పంపిణీ చేసి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదని అధికారులే అభిప్రాయపడుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement