ఊరు కాని ఊరిలో... దుర్మరణం

Odisha Man Commits Suicide by Climbing High Tension Tower - Sakshi

తేలినీలాపురంలో ఒడిశా వాసి బలవన్మరణం 

హైటెన్షన్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నది అతడే.. 

బంధువులు వచ్చాకే కారణాలు తెలిసేది.. 

టెక్కలి రూరల్‌: రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష... ఎందుకు మనస్తాపం చెందాడో... ఎందుకు చనిపోవాలనుకున్నాడో... ఊరు కాని ఊరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తేలినీలాపురం సమీపంలో శుక్రవారం 70 అడుగుల ఎత్తులో ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌పై ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించిన వ్యక్తిని ఒడిశావాసిగా గుర్తించారు. శుక్రవారం చీకటి పడటంతో మృతదేహాన్ని దించలేకపోయారు. శనివారంఉదయం టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, ఎస్‌ఐ బి. గణేష్, విద్యుత్‌ శాఖ ఏఈ దయాళ్‌ నేతృత్వంలో 8మంది సభ్యులు టవర్‌పైకి ఎక్కి మృతదేహాన్ని కిందకు దించారు. మృతుని జేబులో ఉన్న ఆధా ర్‌ కార్డు, ఇన్సూరెన్స్‌ కార్డు ఆధారంగా మృతుడి ది ఒడిశా రాష్ట్రం కళహండి జిల్లా బగడ మండ లం ఇచ్చాపూర్‌ గ్రామమని, అతని పేరు కళియమణి బెహర (40) అని గుర్తించారు. అయితే ఒడిశాకు చెందిన అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడే ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలేమిటి? 70 అడుగుల ఎత్తులో ఉన్న టవర్‌ ఎక్కి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తదితర విషయాలు పోలీసులు దర్యాప్తు లో తేలాల్సివుంది.

మృతుడి వద్ద బరంపురం నుంచి విజయనగరం వైపు ఈ నెల 14వ తేదీన తీసిన రైలు టిక్కెట్‌ ఉంది. అతని జేబులో దొరికిన వివరాలను బట్టి బంధువులకు ఫోన్‌ చేయగా మృతుడు కొద్ది రోజులుగా కేరళలో పనిచేస్తున్నాడని తెలిసింది. కేరళ నుంచి బరంపురం వెళ్లి.. అక్కడి నుంచి విజయనగరం వెళ్లేందుకు రైల్వే టికెట్‌ తీసుకొని ఉంటాడని, మధ్యలో నౌపడ స్టేషన్‌లో దిగి తేలినీలాపురం సమీపంలో బలవన్మరణానికి పాల్పడి వుంటాడని భావిస్తున్నారు. బరంపురం ఎందుకు వెళ్లాడు.. ఇక్కడికి ఎందుకు వచ్చాడు.. తెలియాలంటే అతని కుటుంబసభ్యులు రావాలని, అతని వద్ద ఉన్న ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా మృతుడి మేనమామకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top