
ఆళ్లగడ్డ ఉపఎన్నిక ఎందుకు నిలిపినట్టు?
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)అందులో ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ శాసనసభ స్థానాన్ని చేర్చకపోవడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ, 33 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)అందులో ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ శాసనసభ స్థానాన్ని చేర్చకపోవడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఏపీ, తెలంగాణలో కలిపి ఒక లోక్సభ (మెదక్) స్థానం, రెండు అసెంబ్లీ (ఆళ్లగడ్డ, నందిగామ) ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ మూడు స్థానాల్లో అన్నింటికన్నా ముందుగా ఆళ్లగడ్ఢ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందుగానే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి ప్రమాదంలో మృతి చెందగా, అప్పటికే నామినేషన్ దాఖలు చేసిన కారణంగా ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికను యధాతథంగా నిర్వహించింది. ఆ తర్వాత మే నెల 16 న జరిగిన లెక్కింపులో ఆమె విజయం సాధించినట్టు ప్రకటించింది.
అయితే అప్పటికే ఆమె మరణించిన కారణంగా తిరిగి ఆ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది. మే 25 న మెదక్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 15 వ తేదీ గుండెపోటుతో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మరణించారు. రాజ్యాంగం ప్రకారం ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు ఆరు నెలల్లోగా ఉపఎన్నికలు పూర్తి చేయాలి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం శనివారం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 34 అసెంబ్లీ స్థానాల్లో ఆళ్లగడ్డను మాత్ర మే మినహాయించి మిగిలిన 33 అసెంబ్లీ స్థానాలకు షెడ్యూలు ప్రకటించడంలోని ఆంతర్యమేమిటని సర్వత్రా చర్చనీయాంశమైంది. మొదట ఖాళీ అయిన స్థానాన్ని ఉపఎన్నికల షెడ్యూలులో ప్రకటించకుండా ఎందుకు పక్కనపెట్టారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ స్థానానికి సంబంధించి కోర్టులో పిటిష న్ పెండింగ్లో ఉన్నందున తాజా షెడ్యూలులో ప్రకటించలేదని ఎన్నికల వర్గాలు చెబుతున్నప్పటికీ అది వాస్తవం కాదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్లో ఉందన్న కారణం సహేతుకంగా లేదని, కోర్టు కేసు తేలడానికి ఏళ్లు పడితే రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోగా ఉపఎన్నికను పూర్తి చేయాలన్నదాన్ని ఈసీ ఎలా విస్మరిస్తుందని ప్రశ్నిస్తున్నారు.