ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షలో సంబంధం లేని ప్రశ్నలు రావడంతో విద్యార్థులు తలలు పట్టుకున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షలో సంబంధం లేని ప్రశ్నలు రావడంతో విద్యార్థులు తలలు పట్టుకున్నారు. ఎంతో ఆశతో ప్రశ్నపత్రం తెరిచిన విద్యార్థులకు, సిలబస్కు సంబంధం లేని ప్రశ్నలు రావడంతో లబోదిబోమన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లో ప్రశ్నావళి అంతా కొత్త సిలబస్లోనే ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో కొత్త సిలబస్పై శిక్షణ తీసుకున్న విద్యార్థులకు నిరాశే ఎదురైంది.
జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షకు సంబంధించి బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు పాత సిలబస్లో ప్రశ్నలు వచ్చాయి. ఎంపీసీ విద్యార్థులకు సంబంధించి ‘బీ’కోడ్ ప్రశ్నపత్రంలో 86, 87, 88, 99 ప్రశ్నలు పాత సిలబస్లోవి ఇచ్చారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. పాత సిలబస్లో మొదటి చాప్టర్ స్టేట్మెంట్లోని ప్రశ్నలను ఈ ప్రశ్నపత్రంలో 86,87, 88 ప్రశ్నలు అడిగారు. అలాగే పాత సిలబస్లో నాల్గో చాప్టర్ లీనర్ ప్రోగ్రామింగ్లోని ప్రశ్నను 99వ ప్రశ్నగా అడిగారు. ఇక సోషియల్ విద్యార్థులకు సంబంధించి ఏకంగా 50 బిట్లు ఉంటే వీటిలో 43 బిట్లు పాత సిలబస్లోవే అడిగారని వాపోతున్నారు. తక్కిన 7 బిట్లు కూడా జనరల్గా అడిగారని పులువురు విద్యార్థులు తెలిపారు.