గాంధీభవన్లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు.
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు. జెండా ఎగురవేసే కార్యక్రమానికి వీరిద్దరు నేతలు ఒకే వేదికపై వచ్చినప్పటికీ కనీసం పలకరించుకోలేదు. గురువారం ఉదయం గాంధీభవన్ ఆవరణలో జరిగిన జెండా వందనం కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స, మంత్రులు దానం, పితాని, మాజీ సీఎం నాదెండ్ల, పీసీసీ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్రెడ్డి తదితరులు హాజరయ్యారు.
బొత్స పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్రంలో సున్నితమైన భావోద్వేగాలున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ సోదరభావంతో మెలగాలని కోరారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, బొత్స. ఇతర నేతలు గాంధీభవన్లో అల్పాహార విందులో పాల్గొన్నారు. సీఎం మాత్రం అందరికంటే ముందే వెళ్లిపోగా... డిప్యూటీ సీఎం, బొత్స కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు జెండా వందనం కార్యక్రమం పూర్తయిన వెంటనే శాప్ మాజీ చైర్మన్ శ్రీధర్రెడ్డి సహా పలువురు నాయకులు ‘జై తెలంగాణ, స్వతంత్ర తెలంగాణ’ అని నినాదాలు చేయగా, పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ పోటీగా ‘జై సమైక్యాంధ్ర’ అని నినాదాలు చేశారు. కాగా, శాసనమండలిలో చైర్మన్ డాక్టర్ చక్రపాణి, శాసనసభ ఆవరణలో సభాపతి నాదెండ్ల మనోహర్ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు.