పోస్టల్శాఖలో అవినీతి జలగలు ఉపాధి హామీ సొమ్మును స్వాహా చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న సిబ్బంది
ఉపాధి హామీ నిధుల్ని బొక్కేస్తున్నారు
నెలల వ్యవధిలోనే మూడు కేసులు
ఇద్దరి సస్పెన్షన్, మరికొందరిపైనా అనుమానం
స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు
సహచర సిబ్బంది ప్రమేయంపైనా ఆరా
తాజాగా టెక్కలిలోనూ బయటపడిన ఉదంతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పోస్టల్శాఖలో అవినీతి జలగలు ఉపాధి హామీ సొమ్మును స్వాహా చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న సిబ్బంది సహాయంతో పోస్టల్శాఖ ఉద్యోగులు బాధితులకు అందాల్సిన ఉపాధి హామీ సొమ్మును బొక్కేస్తున్నారు. కొద్దినెలల వ్యవధిలోనే పలు ఉదంతాలు బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోనే ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు నిఘా బృందాలు గుర్తించాయి. ఉపాధి హామీ నిధులకు సంబంధించి ‘ఎన్ఆర్ఈజీఎస్’ పేరిట వెబ్సైట్ కూడా తెరిచారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏ రోజు కారోజు విడుదల చేసే మొత్తాల్ని సంబంధిత సిబ్బందితో పాటు అధికారులు కూడా క్రాస్ చెక్ చేసేందుకు వీలుగా బయోమెట్రిక్ యంత్రాల్ని అందుబాట్లో ఉంచారు. ఏపీ ఆన్లైన్ ద్వారా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ కింద సొమ్ము బట్వాడా అవుతోంది. కూలీలకు చెల్లించాల్సిన సమయాల్లో ఓ స్లిప్ జనరేట్ చేసి అధికారులకు సంబంధిత ప్రతిని లెక్కల కోసం పంపిస్తుంటారు. ఇక్కడే అవినీతికి బీజం పడుతోందని తెలుస్తోంది.
ఆన్లైన్ లావాదేవీల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి స్లిప్ జారీ అయ్యేటప్పుడు మొత్తాల్లో తేడా కనిపిస్తోంది. ఇలా ఇటీవల టెక్కలి మండలం గూడెంతో పాటు గార మండలం బూరవెల్లిలో ఇద్దరు సిబ్బంది రూ.3లక్షల వరకు సొమ్మును పక్కదారి పట్టించారు. పోస్టల్శాఖ సిబ్బందికి ఆన్లైన్లో పూర్తిస్థాయి శిక్షణ లేకపోవడం, వర్క్షాప్లు పెడుతున్నా పట్టించుకోకపోవడం, స్పెషల్డ్రైవ్ సమయంలో హాజరుకాకపోవడం వంటి అంశాలు సొమ్ము పక్కదారికి ఊతమిస్తోంది. లొసుగులు తెలియడంతో సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు మరికొంతమందిపైనా దృష్టిసారించినట్టు తెలిసింది.
ఇవిగో ఉదంతాలు
శ్రీకాకుళం డివిజన్ గార మండలం సతివాడ పోస్ట్మాస్టర్ తాళ్ల నారాయణరావు.. మరో ముగ్గురితో కలిసి ఉపాధి నిధుల్ని సొంతానికి వాడుకున్నట్టు గతేడాది బయటపడింది. తపాళాశాఖ సొమ్ముకు, బాధితులకు అందజేసిన మొత్తంలోనూ వ్యత్యాసం కనబడడంతో ఉన్నతాధికారులు ఆరా తీశారు. మిగులు సొమ్మును కేవలం కాగితాలపైనే చూపిం చడం, ఒకేసారి లక్షల్లో సొమ్ము డ్రా చేయడంతో ఆ అవినీతి బయటపడింది. ఉపాధి పనులు ఒకేసారి ఊపందుకోవడంతో సొమ్ము అవసరం అని సిబ్బంది చెబుతూ రూ.1.5లక్షలు పంపకాలు జరపాల్సి ఉండగా కేవలం రూ.15వేలే పంపిణీ చేసి అంకెలు మారుస్తుండడంతో బండారం బయటపడింది.
ఇలా ఒకేసారి రూ.1,53,73,868 పక్కదారి పట్టాయి. దీంతో కేసును సీబీఐకి అప్పగించారు. నారాయణరావు ఉపాధి మొత్తాలకు పక్కన 1చేర్చి అంకెలగారడీ కూడా చేశారు. తొలుత ఈ కేసులో పక్కదోవ పట్టిన నిధుల విలువ కేవలం రూ.1లక్ష 20వేలగానే గుర్తించగా నాలుగు రోజుల వ్యవధిలో అది రూ.70లక్షలకు చేరింది. రెండేళ్ల రికార్డులు తిరగదోడేటప్పుడు ఆ విలువ రూ.1కోటిన్నరకు చేరింది. అనంతరం రూ.90లక్షల వరకు రికవరీ చేయగలిగారు.
పోస్టల్శాఖలో పనిచేస్తున్న పాండురంగారావు అనే వ్యక్తిపై గతంలో టెక్కలి పరిధిలోనూ ఇదే తరహా కేసు నమోదైంది. ఖాతాదారులకు చేరాల్సిన ఆర్డీ సొమ్ము పక్కదోవ పట్టించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. గార మండలం బూరవెల్లి బ్రాంచి పరిధిలోని బూరవెల్లి, అంబళ్లవలస గ్రామాలకు బూరవెల్లి తపాలా బ్రాంచి నుంచే ఉపాధి వేతనాలు వెళ్తుం టాయి. అక్కడి బ్రాంచి పోస్టుమాస్టర్ వి.వి.భాస్కరరావు తప్పుడు లెక్కలు సృష్టించి ఉపాధి హామీ నిధులు రూ.71వేలను సొంతానికి వాడేసుకున్నారు.
-టెక్కలి పరిధిలోని గూడెం పోస్టాఫీస్లోనూ రూ.2.30లక్షల ఉపాధి హామీ నిధులు గల్లంతయ్యాయి. ఇందుకు బాధ్యుడైన ఉద్యోగిని ఇప్పటికే శాఖా పరంగా సస్పెండ్ చేయగా విషయం బయటపడితే రికవరీ వసూలు చేయడంలో సమస్య వస్తుందనే ఉద్దేశ్యంతో జిల్లా అధికారులు గోప్యంగా ఉంచారు.