‘రెడ్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండవు’
సాక్షి, కాకినాడ : రెడ్ జోన్లలో ఎలాంటి మినహాయింపు ఇచ్చేది లేదని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఉంటాయని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు స్వీయ నిర్భందం ఒక్కటే మార్గమని, అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా చూసుకుంటామన్నారు. రోజుకు 75వేల మెట్రిక్ టన్నుల ధ్యాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 85 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామని వెల్లడించారు.