రైతు శ్రేయస్సే లక్ష్యం

CM YS Jagan Speech On Rythu Bharosa In AP Assembly Special Sessions - Sakshi

అన్ని విధాలా అండగా ఉండేందుకు ఖరీఫ్‌ నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాలు

అసెంబ్లీ చర్చలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

గ్రామ సచివాలయాలతో అనుసంధానం  

విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు ఒకే చోట సేవలు  

అందుబాటులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు

భూసార పరీక్షలు, విత్తనాల నాణ్యత పరీక్ష, తేమ కొలిచే మీటర్లు..  

సాగుకు ముందే పంటలకు మద్దతు ధర, పంటల సమాచారం  

ఖరీఫ్‌ నాటికి అన్ని ఫీడర్ల నుంచి పగలే 9 గంటల విద్యుత్‌ సరఫరా.. ఇప్పటికే 60 శాతం ఫీడర్లలో అమలు  

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అగ్రిమిషన్‌ ఏర్పాటు 

అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం

రైతులకు ఏమైనా సందేహాలు కలిగిన వెంటనే ఈ భరోసా కేంద్రాలకు వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. అందుకోసం అక్కడ ఒక గ్రూప్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ను కూర్చోబెడుతున్నాం. డైరెక్ట్‌ కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేసి.. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేస్తాం. డైరెక్ట్‌గా వీడియో స్క్రీనింగ్‌ వసతి కూడా కల్పిస్తున్నాం. తద్వారా నిపుణులతో సూచనలు, సలహాలు ఇప్పిస్తాం. ఆ విధంగా ప్రతి రైతుకూ ప్రతి అంశంలో తోడుగా ఉంటాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక ఏ ఒక్క రైతూ నష్టపోయే అవకాశమే లేకుండా అన్ని విధాలా అండగా ఉండేందుకు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు అవసరమైన సాయాన్ని ఈ కేంద్రాల ద్వారా తమ ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయంతో పాటు వ్యవసాయ సూచనలు, పండిన పంట కొనుగోలు చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
 
ప్రతి రైతు సమస్యకూ అక్కడే పరిష్కారం 
రెండు వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు నెలకొల్పామని, వీటి పక్కనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యకు ఈ రైతు భరోసా కేంద్రాలలో పరిష్కారమవుతుంది. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా పక్కనే లైవ్‌ వర్క్‌షాప్‌ కూడా ఉంటుంది. వ్యవసాయంలో బెస్ట్‌ ప్రాక్టీసులు ఏమిటన్నవి చూపి, వాటిని నేర్పించే కార్యక్రమం చేస్తారు. నేచురల్‌ ఫార్మింగ్‌పై అవగాహన కల్పిస్తారు. ఇంటరాక్టివ్‌ సూచనలు, సలహాలు కూడా ఇస్తారు. రైతు భరోసా కేంద్రాలలో క్వాలిటీతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తారు. నాణ్యత లేని విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్‌ కొనుగోలు చేసి రైతులు నష్టపోయే పరిస్థితిని పూర్తిగా మారుస్తాం. క్వాలిటీ స్టాంప్‌ వేసి అమ్ముతారు. రైతు అనేవాడు ఎక్కడా కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదు. ఈ కేంద్రాల ద్వారా ఫిష్, ఆక్వా సాగు చేసే ప్రాంతాలలో.. వాటికి సంబంధించిన క్వాలిటీతో కూడిన ఫీడ్, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌పై అవగాహన కల్పిస్తారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తూ.. రైతులకు అవసరమయ్యే అన్ని సేవలను ఆయా గ్రామాల్లోని ఈ కేంద్రాలు అందిస్తాయి.   
 
భూసార పరీక్షలు 
గ్రామంలో రైతులకు మేలు చేసేందుకు భూసార పరీక్ష (సాయిల్‌ టెస్ట్‌) కూడా చేస్తారు. విత్తనాల నాణ్యతను పరీక్షించే (సీడ్‌ టెస్టింగ్‌) సౌకర్యాలు కూడా అక్కడే ఉంటాయి. ఏ రైతు అయినా ఇక్కడ కొనుగోలు చేసిన విత్తనాలే కాకుండా, వేరే చోట కొనుగోలు చేసిన విత్తనాల నాణ్యత తెలుసుకునేందుకు ఈ సీడ్‌ టెస్టింగ్‌ సదుపాయం ఉపయోగపడుతుంది. ధాన్యంలో తేమ శాతం (మాయిశ్చర్‌ టెస్టింగ్‌) తెలుసుకునే మీటర్లు కూడా రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులోకి తీసుకువస్తాం. 
 

గిట్టుబాటు ధరలు, పంటల కొనుగోలు 
రాబోయే రోజుల్లో రైతులు తాము అమ్ముకునే పంటలకు సంబంధించి.. రైతు పంట వేసేటప్పుడే ఫలానా పంటకు కనీస గిట్టుబాటు ధర ఇదీ అని ప్రకటిస్తాం. ఇంతకన్నా తక్కువ ధరకు ఏ రైతూ పంటను తెగనమ్ముకోవాల్సిన పని లేదు. ఇంతకన్నా తక్కువ రేటుకు ఎవరైనా కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే వివరంగా ఒక ప్రకటన కూడా ఇచ్చాము. (ప్రకటన కాపీని చూపించారు) ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర ఎంత? ఆ పంట ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఎప్పుడు సేకరిస్తాము అన్నది కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నాం.

ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తాయి. రైతు తాను పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? దళారుల దగ్గరకు పోయి తక్కువ ధరకు తెగనమ్ముకునే పరిస్థితి రాకుండా రైతు భరోసా కేంద్రాలు జోక్యం చేసుకుంటాయి. ఇదీ.. ఈ పంట కనీస గిట్టుబాటు ధర. అంత కంటే తక్కువ ధరకు ఎవరూ అమ్ముకోవాల్సిన పని లేదు. ఇంతకన్నా ఎక్కువ ధర వస్తే మీరు బంగారం మాదిరిగా అమ్ముకోండి. కానీ ఇంత కన్నా తక్కువ ధర వస్తే మాత్రం ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయి. రాబోయే రోజుల్లో విత్తనాల పంపిణీని కూడా రైతు భరోసా కేంద్రాలు చేపడతాయి.  
 
ఇన్ని సమస్యలున్నా వెనుకడుగు వేయలేదు.. 
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా వారికి తోడుగా, అండగా ఉంటోంది. ఆర్థిక పరిస్థితులు అన్యాయంగా ఉన్నా, చంద్రబాబునాయుడు ప్రభుత్వం పోతూ పోతూ విపరీతంగా బకాయిలు పెట్టినా భయపడలేదు. ఇన్ని సమస్యలున్నందున మేము ఇచ్చిన మాట నుంచి వెనుకడుగు వేస్తున్నామని ఏనాడూ చెప్పలేదు. దేవుడు సహకరించి, ప్రజలు దీవించడంతో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు.  
 
ఏడాది ముందుగానే వైఎస్సార్‌ రైతు భరోసా 
‘రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని మేము ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చే సరికి జూన్‌ వచ్చింది. నాలుగేళ్ల పాటు, ఏటా రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని మాత్రమే ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. కానీ రైతులకు మంచి చేయాలన్న ఆరాటం, తపన, తాపత్రయంతో గత ఏడాది అక్టోబర్‌లోనే ఇచ్చాము. ఖరీఫ్‌ సీజన్‌లో కాకుండా రబీలోనే వెంటనే అమలు చేశాం. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పిన మొత్తాన్ని ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా దాదాపు 46 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు రూ.13,500 చొప్పున ఇచ్చామని ఈ వేదిక నుంచి గర్వంగా చెబుతున్నాం. 
  
పంట రుణాలపై ప్రభుత్వమే వడ్డీ కడుతుంది.. 
మేము అధికారంలోకి రాగానే జూన్‌లో మరో గొప్ప పథకం.. రైతులకు వడ్డీ లేని రుణాలు అమలు చేశాం. అంతకు ముందు రైతులకు ఆ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇవాళ  ‘వైఎస్సార్‌ వడ్డీ లేని రుణాలు’ అని చెప్పి ప్రవేశపెట్టామని గర్వంగా చెబుతున్నాం. ఖరీఫ్, రబీలో పంట రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని కూడా గర్వంగా చెబుతున్నాం. రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఏ రైతు కూడా తమ పంటలను తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి రాకుండా చేస్తామని మరోసారి భరోసా ఇస్తున్నాం. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశాం. 
 
పగలే 9 గంటల విద్యుత్‌ 

ప్రతి రైతుకు పగటి పూటే 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలన్న తపన, తాపత్రయంలో అడుగులు ముందుకు వేశాము. రాష్టంలో 6,663 వ్యవసాయ ఫీడర్లు ఉంటే, వాటిలో దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఇచ్చే సామర్థ్యం లేదని అధికారులు చెప్పారు. అందువల్ల ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు విడుదల చేశాం. ఇప్పటికే 60 శాతం ఫీడర్ల నుంచి పగలు 9 గంటల విద్యుత్‌ సరఫరా అవుతోంది. వచ్చే జూలై నుంచి 100 శాతం ఫీడర్లు పని చేస్తాయి. 
 
వ్యవసాయ మిషన్‌తో ముందడుగు 
రైతులకు మరింతగా మేలు చేసేందుకు వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశాం. దీనికి నేనే చైర్మన్‌గా ఉన్నా. ఈ అగ్రి మిషన్‌లో రైతులు, స్వామినాథన్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్‌ వంటి నిపుణులు ఉన్నారు. ప్రతి నెలా ఒకసారి కలిసి, వారందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. తర్వాత వాటన్నింటినీ అమలు చేస్తూ ఒక మిషన్‌ మోడ్‌లో పోతున్నాం. ఈ విధంగా ప్రతి అడుగు రైతుల మేలు కోసం వేస్తున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా భవిష్యత్తులో వారికి మరింత మేలు చేసే అవకాశం రావాలని ఆశిస్తున్నాం’ అని సీఎం స్పష్టం చేశారు. అంతకు ముందు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును అభినందిస్తూ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, బోళ్ల బ్రహ్మనాయుడు, రాపాక వరప్రసాద్, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, చెల్లుబోయిన వేణుగోపాల్, కందుల నాగార్జున రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, అప్పల నాయుడు, నాగేశ్వరరావు, రాజన్నదొర, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ప్రసంగించారు. 

‘ఈ క్రాప్‌’ పై అవగాహన కల్పిస్తూ.. అది అమలయ్యేలా చూస్తాయి. జిల్లా, మండలం, చివరకు ఊరును ఒక్కో యూనిట్‌గా పరిగణించి, ఈ ఊళ్లో మీరు ఈ పంట వేస్తే మంచి రేట్లు వస్తాయని చెబుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట పరిస్థితి ఇదీ.. ఈ పంట కొరత ఉంది.. ఈ పంట ఇప్పటికే ఎక్కువగా సాగు చేసినందున మీరు అమ్ముకోలేక నష్టపోతారు.. కాబట్టి ఈ పంట వేయండి అని రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే బాధ్యతను తీసుకుంటాయి.  
 
పశువులకు కూడా మొట్ట మొదటిసారిగా హెల్త్‌ కార్డులు ఇవ్వబోతున్నాం. క్రాప్‌ ఇన్సూరెన్స్, పశువుల బీమాతో పాటు, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఈ కేంద్రాలలో రైతులకు అవగాహన కల్పిస్తారు.  
 
రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నాం. నిజానికి ఇంతకు ముందు రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది.  మేము అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నాం. మిగతా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. ఇందుకు రూ.2,100 కోట్లు రైతుల తరఫున ప్రభుత్వం భరిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top