
చంద్రబాబు దళిత ద్రోహి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితద్రోహి అని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య విమర్శించారు.
భేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్
పగిడ్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితద్రోహి అని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య విమర్శించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు ? అంటూ వివక్షా పూరిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. బాబు తీరుకు నిరసనగా గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులుగా పుట్టిన ఎందరో మేధావులకు ఎదిగారని, అందుకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కరే నిదర్శనమన్నారు. ఈ విషయం మరచి దళితులంటే ఎదో అంటరానివారిగా ముఖ్యమంత్రి చూస్తున్నారని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పి అంబేడ్కర్ విగ్రహానికి పాదాభివందనం చేయాలని డిమాండ్ చేశారు.
బాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నందికొట్కూరు కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. దళితులపై చిన్నచూపు చూడకుండా ముఖ్యమంత్రికి మంచి మనస్సు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఎన్నికల ముందు టీడపీ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు చెప్పి యువతను మోసం చేసిందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మొండిచేయిచూపించిందని, దీతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్త ంచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రమాదేవి, చిట్టిరెడ్డి, డీలర్ నారాయణ, వెంకటరామిరెడ్డి, సీపీఎం నాయకులు నాగన్న, జంబులయ్య, సన్నన్న తదితరులు పాల్గొన్నారు.