ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాల రూపకల్పన కసరత్తు తుది దశకు చేరింది.
ఏపీ ఉద్యోగుల హెల్త్ కార్డుల ముసాయిదా మార్గదర్శకాలు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాల రూపకల్పన కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేస్తే.. జీవో జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. చికిత్స వ్యయ గరిష్ట పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ధారించారు.
అయితే పరిమితికి మించి చికిత్స కొనసాగించాల్సిన పరిస్థితుల్లో అదనపు మొత్తం మంజూరు చేస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్నా.. అమలు విధివిధానాలు స్పష్టంగా లేవని తెలిసింది. రూ. 175 కోట్లతో ఏర్పాటు చేసే కార్పస్ ఫండ్ నుంచి పరిమితి దాటిన చెల్లింపులు చేస్తామని గతంలో అధికారులు ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే తాజా ప్రతిపాదనల్లో కార్పస్ ఫండ్ ప్రస్తావన లేదని తెలిసింది. జాబితాలో లేని రోగంతో ప్రైవేట్ ఆసుపత్రి వెళితే అత్యవసర పరిస్థితి అయినా సదరు రోగిని దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలనే నిబంధన మార్గదర్శకాల్లో చేర్చినట్లు తెలిసింది. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.