రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో ఈ పేరే ఉన్నా ఇంగ్లిష్వారు తాము పిలుచుకోవడానికి వీలుగా రాజమండ్రిగా మార్చారని, దాన్ని మళ్లీ మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజమహేంద్రవరాన్ని ఆధునిక టూరిజం నగరంగా, రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గోదావరి మహా పుష్కరాల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి నగరంలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాలను కలిపే గామన్... ధవళేశ్వరం బ్యారేజీ చుట్టూ రౌండుగా 35 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతం మొత్తాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామన్నారు. తొలివిడతగా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ జైలు పక్కన ఖాళీగా ఉన్న 50 ఎకరాల స్థలంలో కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని అన్ని చారిత్రక ఆనవాళ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పుష్కరుడు వచ్చే సంవత్సరంవరకూ గోదావరిలోనే ఉంటాడని, ఆ తర్వాత కృష్ణా నదిలోకి వస్తాడని రెండేళ్లు మన రాష్ట్రంలోనే ఉంటాడని చెప్పారు. పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించామని, అధికార యంత్రాంగం చిత్తశుద్ధివల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు.