
రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం
కడప సెవెన్రోడ్స్ : జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఉద్యాన పంటలు, వృక్షాలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణలో ఉద్యాన పంటలు, చెట్లు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అంచనా ప్రక్రియపై శనివారం కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి సంబంధిత అధికారులు, ఆయా డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లతో జేసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షకు ఎస్డీసీ, ఎన్హెచ్ పీడీ వెంకటపతి, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు సాయిశ్రీ, చిన్నయ్య సంబంధిత రీజియన్ల ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ పీడీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బెంగళూరు–కడప–విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ చేపడుతున్నామన్నారు. అందుకు సంబంధించి జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ శాఖకు చెందిన పలు భూములను కొను గోలు చేసి భూములు కోల్పోయినవారికి పరిహా రం కూడా ఇస్తున్నామన్నారు. అందులో భాగంగా చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో జమ్మలమడుగు, వి.ఎన్. పల్లె మండలాల్లో ఉద్యాన పంటలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టం రాకుండా.. భూసేకరణ చట్టంలోని సంబంధిత ప్రామాణికాలను పక్కాగా పాటిస్తూ.. పరిహారం అంచనాలను నివేదించాలన్నారు. చెట్ల వయస్సు, చెట్ల పెంపకానికి ఎరువులు, ఫర్టిలైజర్స్ ఇతర నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు రైతులు వెచ్చించిన వ్యయం తదితర అంశాలను ఉద్యాన వన శాఖ అధికారులు కచ్చితంగా, పారదర్శకంగా వ్యాల్యూయేషన్ చేయాలన్నారు. ఇం పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ పీడీ అశోక్ కుమార్, ఆర్–బి నేషనల్ హైవే ఈఈ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎన్హెచ్ ప్రాజెక్టుల ప్రతినిధులు, ఫారెస్ట్, భూసేకరణ, రెవెన్యూ, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అదితిసింగ్