
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
కడప అర్బన్ : ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ఈజి అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బైక్లు నడిపే వారు కచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్లకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు.