
మానవత్వం పెనవేసిన బంధం
కడప కల్చరల్ : రక్తదానం చేయడమంటే అదో గొప్పతనం. ఓ మనిషికి నిండు ప్రాణం నిలుపడంలోని ఔన్నత్యం. ఇలా మానవత్వం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తనవి తీరదు. నీరు లేకుంటే ఒకరోజైనా బతకవచ్చుగానీ, అవసరమైన సమయంలో రక్తం లభించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. అవసరమై ఎంత ప్రాధేయపడినా రక్తదానం చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్బంగా ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.
రక్తదాతలు..ప్రాణదాతలతో సమానం
రక్తదాతలను బంధువుల కంటే ఎక్కువగా భావిస్తారు. అవసరమైనపుడు వారు మనలా ఎందరికో ప్రాణాలు దక్కేందుకు కారకులవుతారు. అందుకే అలాంటి సమయంలో రక్తదానం చేసే వారిని ప్రాణదాతలంటారు. రక్తం ఇచ్చిన వారెవరో తెలియకపోయినా ఆ రక్తంతో తమ ప్రాణం నిలబడినందుకు వారి మధ్య రక్తసంబంధం ఏర్పడుతుంది. జిల్లాలో రికార్డు స్థాయిలో రక్తం ఇచ్చిన దాతగా ప్రొద్దుటూరుకు చెందిన గురివిరెడ్డిని పేర్కొంటారు. రక్తదానాన్ని ఉద్యమంగా తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించిన బోగా పార్వతమ్మ రక్తదాన సేవా సమితి వ్యవస్థాపకులు బోగా చిన్నయ్య, పోరుమామిళ్లకు చెందిన జ్ఞాన సరస్వతి చారిటుబల్ ట్రస్టు వ్యవస్థాపకులు యనమల శ్రీనివాసులు, రక్తదాన ప్రచారమే పెద్ద వ్యాపకంగా పూర్తి స్థాయిలో ప్రచారం, అవగాహన నిర్వహిస్తున్న పట్టుపోగుల పవన్కుమార్... వీరి స్ఫూర్తితో ప్రస్తుతం జిల్లాలో 100కు పైగా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కూడా రక్తదాన సేవలు అందిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా స్పందించి పార్టీలో ఓ విభాగాన్ని రక్తదానం కోసం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ రంగం నుంచి తప్పుకున్నా మిగతా వారిలో మరికొందరు యువత ముందుకు వచ్చి ఆ బాధ్యతను తాము మోసేందుకు సిద్ధమంటున్నారు. వాళ్లలో రక్తంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా మెండుగా ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వేగం తగ్గినా మొన్నటివరకు బోగా చిన్నయ్య రక్తదాన ఉద్యమకర్తగా గొప్ప కీర్తి ప్రతిష్ఠలు సాధించారు. ఇతరులను ప్రోత్సహిస్తూ మరెందరికో స్ఫూర్తినిస్తున్న ఆయనను మిగతావారంతా ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. లక్షలాది రూపాయలు స్వంత నిధులు వెచ్చించి రక్తదాన ఉద్యమంలో తాను ప్రధానపాత్ర పోషించారు.
ఖూన్ కా రిస్తా
నగరంలో 2015లో సంస్థ ఏర్పాటైంది. స్థానిక యువకులు ఎం.తారిఖ్ అలీ, ఎస్ఎండీ గౌస్ఖాన్లు స్థాపించారు. రక్తం కొరతతో ఎవరికీ ప్రాణాపాయం కలగకూడదన్న భావనతో ఏర్పాటైన ఈ సంస్థ కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలతోపాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో కూడా సేవలందిస్తోంది. రక్తం అవసరమున్న వారు 99481 04130 నెంబరులో సంప్రదిస్తే వెంటనే తమ సభ్యులను సంప్రదించి అవసరమైన రక్తదాతను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ రంగంలో యువతలో జోష్ నింపేందుకు నాటి క్రికెట్ క్రీడాకారుడు అజారుద్దీన్ను వ్యయ ప్రయాసలు వెచ్చించి రక్తదాతల్లో ఉత్సాహం నింపారు. ఐపీఎల్ క్రికెటర్ పైడికాల్వ విజయ్కుమార్తో కూడా పలు శిబిరాలకు హాజరవుతూ యువతలో ఉత్సాహాన్నినింపుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 580 శిబిరాలు నిర్వహించి 20407 మంది రక్తదానం చేసేలా కృషి చేశారు.అలాగే శిబిరాలతోపాటు రక్త నిర్దారణ శిబిరాలు నిర్వహించారు. జిల్లాలో మంచి రక్తదాన సంస్థగా అతి తక్కువ సమయంలోనే ఈ సంస్థ పేరు గడించింది.
లైఫ్.. ఈజ్ బ్లడ్
రక్తం అంటే ప్రాణమే. అవసరమైన సమయంలో ప్రాణాన్ని కాపాడేది రక్తమేనని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి సురేష్కుమార్ అంటున్నారు. రక్తదానం చేయడంలోని ఆత్మ సంతృప్తి, సేవా తత్పరత మరొకటి ప్రాణం నిలుపగలిగే అవకాశం లభించడం గొప్ప విషయమే. సమీపం నుంచి ఇలాంటి ఎందరినో రెడ్క్రాస్ సంస్థ ద్వారా చూస్తున్నాను. చాలాసార్లు రక్తం లేకుండా ఇబ్బందులు పడకూడదని, ఇలాంటి దురదృష్టం మరెవరికీ రాకూడదని, బాధలు పడుతున్న వారిని చూస్తున్నాను. ఇలాంటి వారికి అతి తక్కువ ధరలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కేవలం నామమాత్రపు ఽచార్జీలతో ప్రజలకు అవసరమైన రక్తం అందిస్తున్నాం. సిబ్బంది అందరిలో కూడా మానవత్వపు అనుభూతి ఉండడంతో వారు కూడా బంధువుల్లా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మాత్రం సేవలు అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

మానవత్వం పెనవేసిన బంధం