
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
– స్కూటీని ఢీకొన్న క్యాంపర్ వాహనం
కడప అర్బన్ : సొంత పని కోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో క్యాంపర్ వాహనం స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు ఇద్దరు బావాబామ్మర్దులు కావడంతో రెండు కుటుంబాలు విషాదంతో నిండిపోయాయి. కడప ట్రాఫిక్ ఎస్ఐ జయ రాములు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. కడప చలమారెడ్డి పల్లెకు చెందిన నంద్యాల రవి (32) ప్రైవేట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వరుసకు బావమరిది అయిన రాయచోటి వినోద్ (26) ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే రాయచోటి వినోద్కు కడపకు చెందిన యువతితో వివాహం జరిగింది. వినోద్ భార్య ప్రస్తుతం గర్భిణి. సొంత పని నిమిత్తం రవి, వినోద్ ఇద్దరు కలిసి స్కూటిలో చలమారెడ్డి పల్లె నుంచి అలంఖాన్పల్లెకు వెళ్లారు. తిరిగి చలమారెడ్డిపల్లెలోని తమ ఇంటికి వస్తున్న సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన మహేంద్ర క్యాంపర్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జయరాములు తెలిపారు.
అసిస్టెంట్ లైన్మెన్పై విచారణ జరపాలి
ప్రొద్దుటూరు : తప్పుడు పద్ధతిలో ఉద్యోగం పొందిన అసిస్టెంట్ లైన్మెన్ మైలవరం సాయికుమార్పై విచారణ జరపాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోసా మనోహర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని సౌత్ సెక్షన్లో సాయికుమార్ విధులు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన తన తండ్రి మైలవరం శేఖర్ మరణానంతరం కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందారని తెలిపారు. ఆయన ఏవిధంగా మరణించారన్న విషయంపై సాక్ష్యాధారులు లేకుండా, డెత్ సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం పొందారన్నారు. ఈ విషయంపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ విషయంపై ఈఈని సాక్షి వివరణ కోరగా గోసా మనోహర్ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని ఏడీఈకి బాధ్యతలు అప్పగించామన్నారు. ఆయన బదిలీపై వెళ్లడంతో విచారణ ఆగిందని, కొత్తగా వచ్చిన ఏడీఈతో విచారణ పూర్తి చేయిస్తామని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి