
టీడీపీ కుట్రలు పటాపంచలు
కడప కార్పొరేషన్: కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వ విప్ మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చేసిన కుట్రలు ఫలించలేదు. మేయర్పై ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయిస్తూ పురపాలక శాఖతో వారు ఇప్పించిన ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. వివరాలిలా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులపై కుట్రలు, కుతంత్రాలు మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభపెట్టడం, సామ, దాన, భేద, దండోపాయాలతో బెదిరించి టీడీపీలో చేర్చుకోవడం ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను కుతంత్రాలతో చేజిక్కించుకోవడం ఒక తంతుగా మారింది. కడపలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆర్.మాధవి ఆధ్వర్యంలో అంతకు రెట్టింపు స్థాయిలో కక్షసాధింపు చర్యలు ఊపందుకున్నాయని చెప్పవచ్చు. నగర ప్రథమ పౌరుడైన మేయర్ సురేష్ బాబు ఇంటిపై చెత్త వేయించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి....నగరపాలక సర్వసభ్య సమావేశంలో మేయర్తో సమానంగా తనకు కుర్చీ వేయకపోవడంపై మరింత రెచ్చిపోయారు. ఎలాగైనా సరే మేయర్ను పదవీచ్యుతుడిని చేయాలన్న కక్షతో ఎమ్మెల్యే, ఆమె భర్త, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మేయర్పై మున్సిపల్ శాఖకు ఫిర్యాదులు చేశారు. మేయర్ కుమారుడు కాంట్రాక్టు వర్కులు చేశారని విజిలెన్స్కు ఫిర్యాదు చేసి, మున్సిపల్ చట్టంలోని చిన్న లొసుగును ఆధారంగా చేసుకొని ఆయనపై అనర్హత వేటు వేయించారు. ఈనెల 14వ తేదీ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మేయర్ సురేష్బాబు హైకోర్టును ఆశ్రయించారు. మేయర్ వేసిన పిటిషన్ను సింగిల్ బెంచ్ తోసిపుచ్చడంతో...ఆయన డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. గురువారం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేస్తూ పురపాలక శాఖ ఇచ్చిన ఉత్వర్వులపై స్టే విధించింది.
సంఘీభావం తెలిపిన నేతలు
న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ మేయర్ సురేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డా. దాసరి సుధ, కార్పొరేటర్లు తదితరులు మేయర్ను కలిసి సంఘీభావం తెలిపారు.
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు,
నాయకుల సంబరాలు
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. గురువారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయం వద్ద, అపూర్వ ఫంక్షన్ హాలులో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో ఎమ్మెల్యే మాధవి ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలిచిందని వారు తెలిపారు.
మేయర్ అనర్హత ఉత్తర్వులపై హైకోర్టు స్టే
కడప ఎమ్మెల్యే మాధవికి చుక్కెదురు