
రైతుల కష్టం.. దొంగల పాలు!
కొండాపురం : ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు దెబ్బ తీస్తుంటే.. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో చేతికంది వచ్చిన పంటను దొంగలు ఎత్తుకెళ్తుంటే వారి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని లావనూరు గ్రామానికి చెందిన ఉమా మహేశ్వర్రెడ్డి తన బంధువుల పెళ్లి పనులు చూసుకుంటూ చీనీ తోట వద్దకు ఐదు రోజుల నుంచి వెళ్లలేదు. ఆరో రోజు చీనీ తోటలోకి వెళ్లి చూసేసరికి చీనీ చెట్లకు ఉన్న కాయలు లేవు. ఆరు ఎకరాల్లో పూర్తిగా 13 నుంచి 15 టన్నులు గుర్తు తెలియని వ్యక్తులు కోసుకెళ్లారు. ఈ ఘటనతో రైతు ఆందోళన చెందారు. అలాగే పక్కనే ఉన్న లక్ష్మిరెడ్డికి చెందిన ఆరు ఎకరాల్లో చీనీ తోట ఉంది. అందులో ఎకరాన్నర వరకు 5 టన్నులు, ఈశ్వర్రెడ్డి చీనీతోటలో చెట్లకు పైన పైన చీనీ కాయలను దుండగులు కోసుకుని పోయారు. మొత్తం 22 టన్నుల చీనీ కాయలను రాత్రివేళ ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందని రైతులు తెలిపారు. పోలీసు అధికారులు వెంటనే స్పందించి దొంగలను పట్టుకొని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
రాత్రి వేళ 30 గొర్లను ఎత్తుకెళ్లారు..
మండలంలోని కె.రామిరెడ్డిపల్లె గ్రామంలో ఓ ఇద్దరు గొర్ల యజమానులకు చెందిన 30 మూగజీవాలు (గొర్లు) గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఎత్తుకెళ్లారు. గ్రామ సమీపంలోని పెద్దమ్మ గుడి సమీపంలో ఓ రైతు పొలంలో కంచె వేసుకొని గొర్ల మంద తోలుకున్నారు. గొర్ల కాపర్లు పగలంతా గొర్లు మేపడానికి పొల్లాల్లో తిరిగి అలసిపోయి రాత్రి నిద్ర పోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు 30 గొర్లను ఎత్తుకెళ్లారు. ఆ మూగ జీవాల ధర రూ. 4 లక్షల పైగా ఉంటుందని గొర్ల కాపర్లు పేర్కొంటున్నారు. ఈ రెండు ఘటనలపై ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. పోలీసులు గట్టి నిఘా పెట్టి దొంగలను గుర్తించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
చీనీ తోటల్లో కాయలు అపహరిస్తున్న దుండగులు
సుమారు 22 టన్నుల చీనీ కాయలు చోరీ
రూ.6 లక్షలపైగా నష్టం
లబోదిబో మంటున్న రైతులు