గతి తప్పిన రిమ్స్‌ | - | Sakshi
Sakshi News home page

గతి తప్పిన రిమ్స్‌

Apr 2 2025 1:40 AM | Updated on Apr 2 2025 1:40 AM

గతి త

గతి తప్పిన రిమ్స్‌

కడప టాస్క్‌ఫోర్స్‌ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌, రిమ్స్‌)లో వైద్యులు, ఇతర సిబ్బంది విధి నిర్వహణ గతి తప్పుతోంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో చాలామంది తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తుంటారు. వీరుగాక కొందరు వైద్యులు మాత్రం తమకు నచ్చిన, తమను మెచ్చిన వైద్యులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని ‘రిమ్స్‌’ ప్రాంగణంలోనే తిరుగుతూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు. కొందరు డాక్టర్లు తమకేమీ పట్టనట్లు బయోమెట్రిక్‌, ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసిన తరువాత అలా బయటకు వెళ్లి టిఫిన్‌లు, కాఫీలను ముగించుకుని ఎంచక్కా 9 గంటలకు పైగా తమకు నచ్చిన సమయంలో వచ్చి విధులను నిర్వహిస్తుంటారు. మరికొందరు ఇంటి నుంచి తమ, తమ సొంతకారులో ఐపీ విభాగానికి వారి వార్డులకు వెళ్లి అక్కడ విధులను నిర్వహిస్తున్న హౌస్‌సర్జన్‌లు, పీజీలకు విధులను అప్పజెప్పి ‘హాయ్‌, బాయ్‌’ అని చెపుతూ తమదారిన తాము కారు పార్కింగ్‌ దగ్గరకు వచ్చేస్తారు. తరువాత రిమ్స్‌ ఆవరణంలోనూ, రిమ్స్‌ ఆవరణం చుట్టూ బైపాస్‌ రోడ్లలోకి వెళ్లి తమ ‘ఇష్టాలు, కష్టాలు’ పంచుకుని మరలా వైద్యాఽధికారులు రౌండ్స్‌కు వచ్చే సమయానికి ఎంచక్కా విధులకు హాజరై కాలక్షేపం చేసి సమయం పూర్తికాగానే ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

● మంగళవారం ఓపీ విభాగంలో కొన్ని విభాగాలలో హెచ్‌ఓడీలు, వైద్యులు ఎంచక్కా విధులకు వస్తే కొన్ని విభాగాలలో మాత్రం హౌస్‌సర్జన్‌లు, పీజీ వైద్యులు మాత్రమే వైద్యపరీక్షలను నిర్వహిస్తున్నారు. మహిళా ఆర్థోపెడిక్‌ విభాగానికి వైద్యులు అస్సలు అరగంటపైగా దాటినా రాకపోవడం గమనార్హం. ఈ విధులకు హాజరుకాని వైద్యులలో ఇద్దరు గతంలో బయోమెట్రిక్‌కు వేలిముద్రలు మాయం చేసి, అవి అధికారుల దృష్టికి వెళ్లడం, ప్రతి చర్యగా సదరు వైద్యులను కొన్ని నెలలపాటు కలెక్టరేట్‌లో విధులు నిర్వహించేలా చేసినా వారి పద్ధతిని మార్చుకోలేదనే ప్రజలు అనుకుంటున్నారు.

● పరిపాలనా విభాగంలో ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్‌ రీ ఎంబర్స్‌మెంట్‌ ‘బిల్లులు’ మంజూరు కావాలంటే తప్పనిసరిగా ‘చేయి తడపాల్సిందే’. తమకు అనూకూలంగా పర్సెంటేజీల వంతుగా చేతులు తడిపితే కానీ ఫైళ్లు ముందుకు కదలవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులైనా, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వైద్యులకై నా ఈ తిప్పలు తప్పడం లేదంటున్నారు.

● ఇక్కడ పనిచేస్తున్న కొన్ని విభాగాల వైద్య సిబ్బంది విధులకు సంబంధించిన డ్యూటీ చార్ట్‌లను వేయడంలో కొందరు నకిలీ విలేకరుల ప్రమేయం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు మహిళా అధికారులను ఏకంగా సదరు నకిలీ విలేకరులు, ఫోన్‌లలో బెదిరించడం సదరు అధికారులు, మహిళా సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లుగా, తాము ఎవరికై నా చెప్పుకుంటే తమ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగినట్లుగా భావిస్తూ ‘పంటి బిగువు’న ఆ వేధింపులను, వెకిలి చేష్టలను సైతం భరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే మనిషినంటూ ఓపీ క్యాంటీన్‌కు తాళం..

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఓపీలో క్యాంటీన్‌ సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండేవి. ఈ క్యాంటీన్‌కు వచ్చే రోగులు, వారి సహాయకులు బయటకు వెళ్లకుండానే తక్కువ ధరలకే టీ, కాఫీ, వాటర్‌ బాటిళ్లు, ఇతర అల్పాహార సేవలను పొందేవారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా సేవలను అందుకునేవారు. కాస్త ఉపశమనం పొందేవారు. గడువు ముగిసిన తరువాత అధికారులు నిబంధనల మేరకు టెండర్లను పిలవకుండానే.. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మనిషినంటూ ఓ వ్యక్తి వచ్చి క్యాంటీన్‌కు తాళం వేసి ఎంచక్కా వెళ్లాడు. ఓ ప్రైవేట్‌ వ్యక్తి వచ్చి తాను ఎమ్మెల్యే మనిషినంటూ క్యాంటీన్‌కున్న రెండు వాకిళ్లకు తాళాలు వేసుకుని వెళ్లడం ఎంతవరకు సమంజసమని సామాన్య ప్రజలు సైతం తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారం తెలిసినా తమకేమీ పట్టనట్లు, తెలియనట్లు అధికారులు సైతం వ్యవహరించడం కొసమెరుపు.

ఉదయం 9:20 అవుతున్నా

విధులకు రాని ఆర్థోపెడిక్‌ వైద్యులు

వైద్య సిబ్బంది డ్యూటీ చార్ట్‌లలో నకిలీ విలేకరుల ప్రమేయం

మెడికల్‌ రీ ఎంబర్స్‌మెంట్‌ బిల్లుల

మంజూరులో ‘చేతులు తడపాల్సిందే’

ఎమ్మెల్యే మనిషినంటూ ఓపీ క్యాంటీన్‌కు తాళాలు వేసినా పట్టించుకోని అధికారులు

గతి తప్పిన రిమ్స్‌1
1/3

గతి తప్పిన రిమ్స్‌

గతి తప్పిన రిమ్స్‌2
2/3

గతి తప్పిన రిమ్స్‌

గతి తప్పిన రిమ్స్‌3
3/3

గతి తప్పిన రిమ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement