
నిజాయితీ చాటుకున్న కండక్టర్
చిట్యాల: బస్సులో ప్రయాణికురాలు మరచిపోయిన హ్యాండ్బ్యాగ్ను భద్రపరిచి తిరిగి ఆమెకు అందజేసి తన నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్ జంగయ్య. వివరాలు.. నల్లగొండ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎల్లారెడ్డిగూడెం నుంచి చిట్యాలకు వస్తున్న యువతి తన హ్యాడ్బ్యాగ్ను మరిచిపోయి చిట్యాల బస్టాండ్లో దిగి వెళ్లిపోయింది. అనంతరం ఆ యువతి కార్గో సెంటర్ నిర్వాహకుడు పొలిమెర దశరథ ద్వారా కండక్టర్కు సమాచారం అందించింది. దీంతో హ్యాండ్బ్యాగును కండక్టర్ తీసుకుని తన వద్ద భద్రపరుచుకున్నాడు. వెంటనే రామన్నపేటకు వచ్చిన యువతికి కండక్టర్ జంగయ్య ఆ హ్యాండ్బ్యాగు అందజేసి నిజాయితీ చాటుకున్నాడు.
రెండు ఇళ్లల్లో చోరీ
బీబీనగర్: మండల కేంద్రంలోని ఓ కాలనీలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. బీబీనగర్లోని గోకుల్నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన వెంకటేశ్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల క్రితం ఊరికి వెళ్లాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న తులం బంగారు చైన్తోపాటు వెండి వస్తువులను అపహరించుకుపోయారు. వారు శుక్రవారం ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన ఇంట్లో పోలీసులు శుక్రవారం పరిశీలించి ఆధారాలు సేకరించారు. అలాగే అదే కాలనీలో చోరీ జరిగిన ఇంటి సమీపంలో పోచంపల్లి మండలంలోని ఇంద్రియాలకు చెందిన కవిత అద్దెకు ఉంటోంది. ఆమె కూడా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వస్తువులను చిందరవందరగా పడవేశారు. ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటిని పరిశీలించారు. కాగా ఇదే కాలనీలో ఇటీవల ఓ ఇంట్లో రూ.50 వేల నగదుతోపాటు బయట పార్క్ చేసి ఉన్న కారును దొంగిలించుకుపోయారు.
ఆలయంలో..
నడిగూడెం : మండల పరిధిలోని వేణుగోపాలపురం సమీపాన ఉన్న శ్రీలక్ష్మి తిరుపతమ్మ ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ దారపునేని నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తాళాలు పగులగొట్టి, ఆలయంలోని హుండీలను ధ్వంసం చేసి హుండీల్లో ఉన్న దాదాపు రూ.15 వేల నగదు చోరీ చేశారు. ఈ విషయమై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు.
ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కూలీ మృతి
వలిగొండ : భవన నిర్మాణ పనికి వెళ్లిన వ్యక్తి పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని వేములకొండలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నపాక బాబు అనే వ్యక్తి రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులకు దినసరి కూలీగా వెళ్తున్నాడు. చిన్నపాక బాబు గురువారం వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో భవన నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు.
బైక్ ఢీకొని సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణం
చివ్వెంల(సూర్యాపేట) : బైక్ ఢీకొట్టడంతో జర్నలిస్ట్ మృతి చెందాడు. ఈ సంఘటన చివ్వెంల మండల కేంద్రంలో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చెరుపల్లి సత్యం (70) మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద రహదారి దాటుతుండగా మోతె నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం, తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సత్యంను సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

నిజాయితీ చాటుకున్న కండక్టర్