
అంతా మా ఇష్టం
● వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికారుల పెత్తనం
● ఉద్యోగులతో ఆప్షన్ ఫారాలపై సంతకాలు
● పీహెచ్ ఉద్యోగుల విన్నపాలు బుట్టదాఖలు
తాడేపల్లిగూడెం: వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో అధికారుల పెత్తనాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారిని కచ్చితంగా బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రాతిపదికన మున్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్లో బదిలీల ప్రక్రియకు ఐచ్ఛికాలను ఇవ్వడానికి ఈనెల 28న ఏలూరులోని ప్రక్రియ ఇన్చార్జి వద్దకు ఉద్యోగులు నేరుగా హాజరు కావాలనేది ఉత్తర్వుల సారాంశం. రాష్ట్రవ్యాప్తంగా శనివారం బదిలీల ప్రక్రియ చేపట్టగా ఆయా జిల్లాల ప్రక్రియ ఇన్చార్జి వద్దకు ఉద్యోగులు నే రుగా హాజరయ్యారు. అయితే ఇందుకు భిన్నంగా జిల్లాలో బదిలీ ల ప్రక్రియ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగులు నేరుగా హాజరై ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ మాత్రం బదిలీల ఐచ్ఛిక పత్రాలపై ఉద్యోగుల సంతకాలు తీసుకుని ఇన్చార్జి అధికారికి ఆయా మున్సిపల్ కమిషనర్లు సమర్పించారు.
కమిషనర్లకు బాధ్యతలు
ఉమ్మడి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ము న్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో బదిలీల ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. వార్డు సచివాలయంలో ఉండే ప్లానింగ్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ, అడ్డిన్, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీలను బదిలీ చేయాల్సి ఉంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. భీమవరం కమిషనర్కు వెల్ఫేర్ సెక్రటరీలు, తణుకు కమిషనర్కు అడ్మిన్ సెక్రటరీలు, నిడదవోలు కమిషనర్కు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు, పాలకొల్లు కమిషనర్కు శానిటేషన్ కార్యదర్శి బదిలీల ప్రక్రియను అప్పగించి, మిగిలిన కార్యదర్శుల బదిలీల ప్రక్రియను ఏలూరులోని ఇన్చార్జి అధికారి చూస్తున్నారు. సీనియార్టీ, మెరిట్, ఫిజికల్లీ ఛాలెండ్జ్ ప్రాతిపదికన జాబితాలు తయారు చేసి అధికారులకు నివేదించడంతో పాటు, ఆప్షన్ల కోసం అభ్యర్థులు నేరుగా హాజరు కావాల్సి ఉంది.
అంతా తూచ్
అభ్యర్థులు నేరుగా ఏలూరులోని ప్రక్రియ ఇన్చార్జి వద్దకు హాజరుకాకుండానే మున్సిపల్ కమిషనర్లు తమతో ఆప్షన్ ఫారాలపై సంతకాలు చేయించి జాబితాలను ఏలూరు పంపించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగుల అభ్యర్థలను బుట్టదాఖలు చేశారని అంటున్నారు. ప్రస్తుత మున్సిపాలిటీలో పనిచేయాలంటే మూడు ఆప్షన్లను ఎంచుకోవాలని, మిగిలిన విషయాలు పర్యవేక్షక అధికారులు చూసుకుంటారని ఉన్నతాధికారులు చెప్పినట్టు సమాచారం. ఆప్షన్ ఫారమ్స్ ఇవ్వని ఉద్యోగులకు వారి ఆప్షన్లతో సంబంధం లేకుండా బదిలీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. పొలిటికల్ రిఫరెన్స్ లేఖలు, మెడికల్ సర్టిఫికెట్లు, స్పౌజ్ సర్టిఫికెట్లను ఆప్షన్ ఫామ్స్కు జత చేసి ఇవ్వాలని ఆదేశించారు.