ఓటర్ల సవరణపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల సవరణపై సమీక్ష

Jun 29 2025 2:19 AM | Updated on Jun 29 2025 2:19 AM

ఓటర్ల

ఓటర్ల సవరణపై సమీక్ష

భీమవరం (ప్రకాశంచౌక్‌): 2025 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో సవరణలు, పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక వసతులు, ఎలక్ట్రోరల్‌ రోల్స్‌ ప్యూరిఫికేషన్‌ విషయంలో సహకరించాలని కోరారు. ఈ ఏడాదిలో కొత్తగా ఓటరు దరఖాస్తులు 6,873 రాగా 6,187 ఆమోదించామని చెప్పారు. అలాగే ఓటరు జాబితా నుంచి తొలగింపుల కోసం 1,191 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఓటర్ల మార్పులు, చేర్పులకు 15,735 దరఖాస్తులకు 14,788 ఆమోదించామన్నారు. జిల్లాలో పురుషులు 7,20,684 మంది, మహిళలు 7,50,377 మంది, థర్డ్‌ జెండర్స్‌ 77 మంది మొత్తం ఓటర్లు 14,71,138 ఉన్నారన్నారు. ఎన్నికల సూపరింటెండెంట్‌ ఎం.సన్యాసిరావు, ఐఎన్‌సీ ప్రతినిధి టి.వంశీ శ్రీనివాసరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.జయశివ, ఎం.రత్నరాజు పాల్గొన్నారు.

ధాన్యం సొమ్ముల కోసం రేపు ధర్నా

భీమవరం: ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ములు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ధాన్యం సొమ్ముల కోసం నిలదీసేందుకు ఏపీ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం భీమవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుబ్బరాజు, ఎం.రామాంజనేయులు శనివారం తెలిపారు. ధాన్యం అమ్మి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ సొమ్ములు ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడులకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సార్వా పనుల కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద వడ్డీలకు తేవాల్సి వస్తోందన్నారు. ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష

తణుకు అర్బన్‌: బెల్టు షాపులను అరికట్టి అక్రమ మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. శనివారం స్థానిక అమరవీరుల భవనంలో నిర్వహించిన ఏపీ కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సిద్ధమైన తాటికల్లుపై ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ మద్యం, ఊరువాడా బెల్టు షాపుల్లో అమ్మకాలు చేస్తూ కల్లు అమ్మకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నా రు. జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మా ట్లాడుతూ మద్యం విచ్చలవిడి అమ్మకాలతో ప లు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. జూలై 14న కల్లుగీత కార్మికుల వెతలు కలెక్టర్‌కు చెప్పుకుందాం కార్యక్రమానికి భీమవరం తరలిరావాలని కోరారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బొక్క చంటి, జిల్లా ఉపాధ్యక్షుడు కడలి పాండు పాల్గొన్నారు.

అత్యవసర సర్వీసుల విధుల బహిష్కరణ

నరసాపురం: మున్సిపల్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళనలో భాగంగా అత్యవసర సేవల విధులు కూడా బహిష్కరించాలని నిర్ణయించినట్టు జేఏసీ నాయకులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా పనులు నిర్వహణను కూడా బహిష్కరిస్తామన్నారు. తాము సమ్మెలో ఉన్నా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నామని, అయితే ఆందోళనకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆషాఢం ఎఫెక్ట్‌

ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంపై ఆషా ఢం ఎఫెక్ట్‌ పడింది. దీంతో శనివారం భక్తుల రద్దీ బాగా తగ్గింది. సాధారణంగా భక్తుల రాక ఎక్కువగా ఉండాల్సి ఉండగా సాధారణంగానే కనిపించింది. ఆలయంలో అన్ని విభాగాల్లో భక్తులు నామమాత్రంగా కనిపించారు.

ఓటర్ల సవరణపై సమీక్ష 
1
1/1

ఓటర్ల సవరణపై సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement