
‘దారితప్పుతున్న కూటమి’ బుక్లెట్ విడుదల
భీమవరం : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 143 హామీలిచ్చి కేవలం 20 హామీలలోపే అమలు చేశారని జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలనన్ విమవర్శించారు. దారితప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన బుక్లెట్ని ఆదివారం భీమవరంలో విడుదల చేశారు. ఈ ఏడాది కాలం కూటమి ప్రభుత్వం పనిని సమీక్షించి సీపీఎం పార్టీ ఈ బుక్లెట్ని ముద్రించి విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి తన ఇచ్చిన హామీలలో 20లోపే అమలు చేశారన్నారు. అత్యధిక హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి రేటింగ్, గ్రేడింగ్ ఇవ్వాల్సి వస్తే ఈ సంవత్సర కాలంలో చాలా తక్కువ మార్కులే వచ్చాయన్నారు. 10కిగాను 1.75 మార్కులు వచ్చాయన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు, బి.వాసుదేవరావు, కమిటీ సభ్యులు జె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జీతాలు సకాలంలో చెల్లించాలి
తణుకు అర్బన్ : తాజాగా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సకాలంలో జూన్ నెల వేతనాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు జి.ప్రకాశం కోరారు. సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేసి పొజిషన్ ఐడీలను కేటాయించి ట్రెజరీ అధికారులకు తగు సూచనలు ఇవ్వాలని కోరారు. ఏపీటీఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా సబ్ కమిటీ సమావేశం ఆదివారం స్థానిక మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ఉందని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తొమ్మిది రకాల పాఠశాల విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు . జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ నారాయణ, జిల్లా కార్యదర్శి కే.రాంబాబు, వి.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సరాసరి వర్షపాతం 22.5 మి.మీ
భీమవరం: జిల్లాలో ఆదివారం 22.5 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా తాడేపల్లిగూడెం 55.2 మి.మీ, పెంటపాడు 39.2, తణుకు 18.6, అత్తిలి 18, గణపవరం 52.2, ఆకివీడు 12.4, ఉండి 9.4, పాలకోడేరు 21, పెనుమంట్ర 15.8, ఇరగవరం 65.2, పెనుగొండ 32.2, ఆచంట 20, పోడూరు 10.4, వీరవాసరం 13.2, భీమవరం 23.2, కాళ్ల 12.6, మొగల్తూరు 7.4, నరసాపురం 7.2, పాలకొల్లు 13చ యలమంచిలి 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష
భీమవరం: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 పరీక్షా కేంద్రాల్లో ఉదయం షిఫ్ట్కు 310 మందికి 296 మంది, మధ్యాహ్నం షిప్ట్లో 310 మందికి 238 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. స్పెషల్ స్క్వాడ్ టీం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
అడిషినల్ డీఎంహెచ్వో బదిలీ
భీమవరం(ప్రకాశం చౌక్) జిల్లా వైద్యా ఆరోగ్యశాఖలో అడిషనల్ డీఎంహెచ్వోగా పనిచేసిన బి.భానునాయక్ ఎన్టీఆర్ జిల్లాకు బదిలీ అయ్యా రు. ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 5 ఏళ్ల సర్వీసు పూర్తికావడంతో బదిలీ చేశారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
భీమవరం (ప్రకాశంచౌక్): సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కలెక్టర్ కార్యాలయం, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో అందించవచ్చన్నారు.

‘దారితప్పుతున్న కూటమి’ బుక్లెట్ విడుదల