
ధాన్యం మద్దతు ధర కంటి తుడుపే
పెదపాడు: ఖరీఫ్, రబీ పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటి తుడుపు చర్యేనని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. పెదపాడు మండలంలోని వట్లూరు గ్రంథాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో మద్దతు ధరలపై సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్పత్తి ఖర్చులు తక్కువ చూపి కేంద్ర ప్రభుత్వం ధరలు ప్రకటించడం వల్ల రైతులకు కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు వాస్తవ ఖర్చులు లెక్కకట్టి ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతులు తుమ్మల ధన కోటేశ్వరరావు, కొమ్మన సాంబశివరావు, కొమ్మనేని అచ్యుతరావు, కొల్లిపర కొండలరావు తదితరులు పాల్గొన్నారు.