
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
భీమవరం (ప్రకాశం చౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో భాగంగా జేసీ టి.రాహుల్కుమార్ రెడ్డితో కలిసి అర్జీలు స్వీకరించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. మొత్తంగా 149 అర్జీలు స్వీకరించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● భీమవరం మండలం తుందుర్రుకి చెందిన చింతలపాటి సూర్యనారాయణరాజు తనకున్న 3.5 ఎకరాల రొయ్యల చెరువు ఆనుకుని పుంత రోడ్డు ఉందని, అయితే ఈ రోడ్డును గ్రామానికి చెందిన పొత్తూరి వెంకటరాజు అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని, దీంతో నడక మార్గం లేక ఇబ్బంది పడుతున్నామంటూ అర్జీ అందించారు.
● వీరవాసరం మండలం రాయకుదురుకి చెందిన దుండి మంగమ్మ తనకు 52 సెంట్ల పొలం ఉందని సరిహద్దు రైతు పంట బోదె పూడ్చడంతో రెండు సెంట్లు కోల్పాయానని, తన భూమికి హద్దులు చూపించాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
నీరు లేక.. పంట సాగు చేయలేక..
అత్తిలి మండలం కంచుమర్రుకి చెందిన రైతు మాండ్రుమాక జయప్రసాద్ వ్యవసాయ భూమికి సాగు నీరందించే పంటో బోదె పూడిపోయింది. చెత్తాచెదారం, డ్రెయినేజీ నీళ్లు బోదెలో వదలడంతో సాగుచేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖరీఫ్, రబీ సీజన్లలో పంట విరామం ఇచ్చి నష్టపోయాయని, సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అర్జీ అందించారు.
కలెక్టర్ నాగరాణి

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి