
సీహెచ్ఓల నిరసన గళం
భీమవరం(ప్రకాశం చౌక్): గ్రామీణ ప్రాంతాల్లోని విలేజ్ క్లినిక్లలో సేవలందిస్తున్న సీహెచ్ఓలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్) (ఎన్హెచ్ఎం) తమ సమస్యలు పరిష్కరించాలంటూ విధులు బహిష్కరించారు. నాలుగు రోజులుగా భీమవరంలోని కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలుపుతున్నారు. జిల్లాలోని 364 మంది సీహెచ్ఓలు సమ్మెలో ఉండటంతో విలేజ్ క్లినిక్లలో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి.
క్లినిక్లకు అద్దెల భారం : జిల్లాలో 364 విలేజ్ క్లినిక్లకు 145 క్లినిక్లు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఏ శాఖలో ఏ ఉద్యోగులు కూడా చేయని విధంగా అద్దె భవనాలకు సీహెచ్ఓలు అద్దెలు భరిస్తున్నారు. ఏడాదిగా సీహెచ్ఓలు ఇలా తమ జీతాల నుంచి అద్దె చెల్లిస్తున్నారు. క్లినిక్కు సగటును రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు మొత్తంగా రూ.36 వేల నుంచి రూ.40 వేల వరకు ఇప్పటివరకూ అద్దెలు చెల్లించారు. అలాగే విద్యుత్ బిల్లులు అదనంగా చెల్లిస్తున్నారు. ముందు వీరి అద్దెలు చెల్లిస్తే తర్వాత ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల చేస్తుంటారు. అయితే ఏడాదిగా అద్దె బకాయిలు రావాల్సి ఉందని సీహెచ్ఓలు అంటున్నారు.
ఎన్క్యూఎస్ సర్టిఫికెట్ కోసం..
నేషనల్ క్యాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ కమిటీ (ఎన్క్యూఎస్) సర్టిఫికెట్ పొందేందుకు విలేజ్ క్లినిక్లో పరికరాలు, నిర్వహణ కోసం ఒక్కో క్లినిక్లో సీహెచ్ఓలు రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. వీటికి కూ డా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగలేదు. ఇలా జిల్లాలో సుమారు రూ.1.90 కోట్ల వరకు సీహెచ్ ఓలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. అలాగే సీహెచ్ఓల జీతాలకు సంబంధించి పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం ఈపీఎఫ్ఓకు చెల్లించడం లేదు. ఇలా ఆరు నెలలుగా పీఎఫ్ సొమ్ము జమ కావడం లేదు.
సూపర్వైజర్లపై భారం : ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లతో విలేజ్ క్లినిక్లను నడిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసి విధు లు అప్పగిస్తున్నారు. జిల్లాలో 34 సీహెచ్సీలు, 136 మంది సూపర్వైజర్లు ఉన్నారు. విలేజ్ క్లినిక్ల బాధ్యతలు తమకు మరింత భారమని సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ఆవేదన చెందుతున్నారు. విలేజ్ క్లినిక్లు మూతపడటంతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి. చిన్నపాటి వైద్యానికి పెద్దాసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
కూటమిపై తిరుగుబాటు
నాలుగు రోజులుగా విధుల బహిష్కరణ
కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శనలు
ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారమే లక్ష్యం
జిల్లాలో 364 మంది సమ్మెలో..
విలేజ్ క్లినిక్లలో నిలిచిన సేవలు
సీహెచ్ఓల డిమాండ్లు
6 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలి.
ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి.
పని ఆధారిత ప్రోత్సాహకాలు క్రమబద్ధీకరించాలి.
ఈపీఎఫ్ను పునరుద్ధరించాలి
క్లినిక్ అద్దె బకాయిలు చెల్లించాలి.
నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలి.
ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలి.
ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు అమలు చేయాలి.

సీహెచ్ఓల నిరసన గళం