మైన్స్‌ కార్యాలయం ఖాళీ | - | Sakshi
Sakshi News home page

మైన్స్‌ కార్యాలయం ఖాళీ

May 1 2025 12:39 AM | Updated on May 1 2025 12:39 AM

మైన్స

మైన్స్‌ కార్యాలయం ఖాళీ

సాక్షి, భీమవరం: జిల్లాలోని గనులు, భూగర్భ శాఖ కార్యాలయం సిబ్బంది లేక అలంకారప్రాయంగా మిగిలింది. నెలల తరబడి పోస్టులు భర్తీకాకపోవడం, ఉన్న వారు సెలవు, డిప్యుటేషన్‌పై వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలతో వెలవెలబోతోంది. ఇన్‌చార్జి అధికారులు అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారు. పట్టించుకునే వారు లేక జిల్లాలో ఇసుక, గ్రావెల్‌, మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. జిల్లాల పునర్విభజన అనంతరం ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో గత ప్రభుత్వం జిల్లా గనులు, భూగర్భశాఖ కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. గతంలో ఏలూరులో ఉండే కార్యాలయం చేరువగా రావడంతో ప్రజలకు సేవలు మెరుగయ్యాయి. ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లోని వశిష్ట గోదావరి తీరం, నరసాపురం నియోజకవర్గంలోని సముద్ర తీరం వెంట ఇసుక, తాడేపల్లిగూడెం ప్రాంతంలో గ్రావెల్‌, ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో ఆక్వా చెరువుల పేరిట మట్టి అక్రమ తవ్వకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే వెంటనే వెళ్లి వాటిని అడ్డుకునే వీలుండేది. అక్రమ తవ్వకాలు చేసిన వారికి జరిమానాలు విధించేవారు.

లీజులు లేక పోస్టులు ఖాళీ : వశిష్ట గోదావరి తీరం వెంట జిల్లాలోని సిద్ధాంతం 1, 2, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడి 1, 2 ర్యాంపులు, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, యలమంచిలి లంక, చించినాడ, మాధవాయిపాలెంలోని డీసిల్టేషన్‌ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు చేసేవారు. గత ఏడాది గోదావరి వరదల తర్వాత నవంబరులో ర్యాంపులు తెరుచుకుంటాయని భావించారు. జిల్లాలోని గోదావరి తీరం కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ (సీఆర్‌జెడ్‌)లోకి వెళ్లడంతో ర్యాంపులు, డీసిల్టేషన్‌ పాయింట్లన్నీ మూతపడ్డాయి. మైనింగ్‌ శాఖకు జిల్లాలో లీజులు లేక భీమవరంలోని కార్యాలయం కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కార్యాలయ సూపరింటెండెంట్‌ లాంగ్‌ లీవ్‌పై వెళ్లిపోగా, సర్వేయర్‌ డిప్యుటేషన్‌పై ఏలూరులో పనిచేస్తున్నారు. ఒక అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ (ఏజీ), ఒక రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ), ఇద్దరు టెక్నికల్‌ అసిస్టెంట్‌(టీఏ)లు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఏఓ), ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్‌లు, చైన్‌మెన్‌, డ్రైవర్‌, స్వీపర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరు నెలల క్రితం జరిగిన సాధారణ బదిలీల్లో ఖాళీలను భర్తీ చేయలేదు. ప్రస్తుతం జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. పూర్వపు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన విజిలెన్స్‌ ఏడీ ఇక్కడ ఇన్‌చార్జి ఏడీగా, ఆయా ఖాళీల్లో ఏలూరుకు చెందిన అధికారులు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు పని ఉన్నప్పుడు వచ్చి వెళుతున్నారు. ఆయా పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారు అధికారులు అందుబాటులో లేక ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోంది.

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు

పాలకొల్లు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయమై ఇటీవల మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఏలూరులో ఉన్నామని, ఉమ్మడి జిల్లా అంతా తామే చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. కార్యాలయానికి వెళ్తే ఎవరూ అందుబాటులో ఉండటం లేదు.

– కలవల వెంకట సురేష్‌కుమార్‌, మేడపాడు

భర్తీకి నోచుకోని ఏజీ, ఆర్‌ఐ, టీఏ, డీఏఓ పోస్టులు

లాంగ్‌ లీవ్‌లో మిగతా అధికారులు

జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ మాత్రమే విధుల్లో

పట్టించుకునే వారు లేక జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

రెచ్చిపోతున్న మట్టి, ఇసుక మాఫియా

జిల్లాలో మైనింగ్‌ లీజులు లేనప్పటికీ పట్టించుకునే వారు లేక నిబంధనలకు విరుద్ధంగా ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లోని గోదావరి తీరంలో బొండు ఇసుక, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీరం వెంట ఇసుక, తాడేపల్లిగూడెం రూరల్‌లోని ఆరుగొలనులో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేస్తే వెళ్లి పరిశీలించే పరిస్థితి ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో పోస్టులు నియామకం చేయడం ద్వారా జిల్లాలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

మైన్స్‌ కార్యాలయం ఖాళీ 1
1/2

మైన్స్‌ కార్యాలయం ఖాళీ

మైన్స్‌ కార్యాలయం ఖాళీ 2
2/2

మైన్స్‌ కార్యాలయం ఖాళీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement