
చెరువుల లీజు పేరుతో బ్యాంకుకు టోపీ
మట్టిని తోడేస్తున్న మాఫియా
నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన టీడీపీ నాయకుడు పాలెం చెరువులో మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు చేపట్టి మట్టిని తవ్వేస్తున్నాడు. 10లో u
ముదినేపల్లి రూరల్: చేపల చెరువులు లీజుకు తీసుకున్నట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి రూ.కోట్లలో రుణం పొంది ఎగ్గొట్టిన వైనంపై సీబీఐ అధికారులు మండలంలోని పలు గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో విచారణ నిర్వహించారు. గురజ, చేవూరు, దేవరం, కాకరవాడ, అల్లూరు గ్రామాల పరిధిలోని రైతుల పేరుతో పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఒక బడాబాబు భీమవరంలోని ఒక జాతీయ బ్యాంకులో 10 ఏళ్ళ క్రితం రూ.కోట్లలో రుణం పొందాడు. 188 మంది రైతుల పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారుచేసి చేపల చెరువులు లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించి బ్యాంకులో రుణం పొందాడు. ఈ రుణాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించగా.. బోగస్ డాక్యుమెంట్లతో రుణాన్ని పొందినట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ అధికారులకు గత అక్టోబరులో ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు గురు, శుక్రవారాల్లో మండలంలో విచారణ జరిపారు. తమ పేరున ఉన్న వరి సాగు చేసుకున్న పొలాలను 2020లో చెరువులు తవ్వించగా 2015 లోనే చెరువులు లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు ఎలా సృష్టించారని ప్రశ్నించారు. స్థానిక వీఆర్వోల నుంచి వివరాలు సేకరించారు. తమ పేరున రూ.కోట్లలో రుణాలు పొందడం సాధారణంగా సాధ్యమయ్యే పని కాదని ఇందుకు స్థానికులు కొందరు సహకరించి ఉంటారనే అనుమానాన్ని బాధిత రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగ రుణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని సీబీఐ అధికారులు చెబుతున్నారు.