
నివాళులర్పిస్తున్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
ములుగు: బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్(47) గుండెపోటుతో మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విషాదంలో ముగినిపోయారు. హనుమకొండ స్నేహనగర్లోని స్వగృహంలో ఉండగా ఆదివారం ఉదయం ఆయనకు గుండెనొప్పి రావడంతో గుర్తించిన కుమారుడు వెంకట సత్యదేవ్, సోదరుడు కన్నయ్య, గన్మెన్ కలిసి జగదీశ్వర్ను లైఫ్లైన్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ములుగు రోడ్డులోని అజర ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గత నెలలో జగదీశ్వర్కు మైల్డ్ స్ట్రోక్ రావడంతో అజర ఆస్పత్రిలో వారం రోజుల చికిత్స పొందారు. అనంతరం నిర్వహించి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కుసుమ జగదీశ్ బ్రెయిన్ స్ట్రోక్తో మరణించినట్లు ప్రచారం జరుగుతోంది.
తరలివచ్చిన పార్టీ శ్రేణులు
జెడ్పీ చైర్మన్ మృతి చెందారనే వార్త సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఆస్పత్రి వద్దకు చేరుకుని.. మృతదేహాన్ని చూసి తమ నాయకుడు ఇక లేడని కన్నీటి పర్యంతమయ్యారు. జగదీశ్వర్ మృతి విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి చెంది ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, జలవనరుల సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ మంత్రి చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, జెడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగదీశ్వర్ మృతదేహాన్ని చూసి రాష్ట్ర గిరిజన, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే సీతక్క ఆస్పత్రికి చేరుకొని నివాళులర్పించారు. పార్థివ దేహాన్ని మల్లంపల్లి తరలించగా ఆమె వెంట వచ్చారు. వేలాదిగా వచ్చిన పార్టీ కార్యకర్తలతో మల్లంపల్లిలో విషాదం నిండుకుంది.
నేడు అంత్యక్రియలు
జగదీశ్వర్ స్వగ్రామం ములుగు మండల పరిధి మల్లంపల్లిలో అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం వరకు పార్టీ శ్రేణులు, స్థానికుల సందర్శనార్థం పార్థ్థివ దేహాన్ని ఉంచనున్నారు.
ఉదయం రానున్న మంత్రి కేటీఆర్
ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చాపర్ ద్వారా ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి జగదీశ్వర్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నేలకొరిగిన ఉద్యమ కిరణం
ములుగు మండలం మల్లంపల్లికి చెందిన ఆదినారాయణ–సులోచన దంపతులకు జగదీశ్వర్ నాలుగో సంతానం. ఆయనకు భార్య రమ, కుమారుడు వెంకట సత్యదేవ్, కూతురు హరిచందన ఉన్నారు. 1991లో మల్లంపల్లి పాఠశాలలో 10వ తరగతి చదివిన జగదీశ్వర్.. తొలి నుంచి తెలంగాణ ఉద్యమ కారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కళాశాలలో చదువుతున్న సమయంలో విశ్వ భారత్ యూత్ను ప్రారంభించి గుడుంబా, గుట్కా నియంత్రణపై ఉద్యమాలను మొదలు పెట్టారు. సైకిల్ యాత్ర నిర్వహించి అప్పటి సీఎం చంద్రబాబునాయుడు వరకు వెళ్లారు. 2001 తెలంగాణ ఉద్యమ సమయంలో యూత్ ఆర్గనైజేషన్లో పని చేయడంతో పాటు అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టి కేసీఆర్ దృష్టిలో పడ్డారు. 2001కి పూర్వం విప్లవ పార్టీలో కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత 2014 వరకు ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధించాక జగదీశ్వర్ సీఎం కేసీఆర్కు దగ్గరయ్యారు. 2019 ఆగస్టులో ములుగు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఏటూరునాగారం నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు. అనంతరం కేసీఆర్ ఆశీర్వాదంతో జెడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడిగా, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు.
దిగ్భ్రాంతికి గురి చేసింది..
హన్మకొండ: ములుగు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయస్సులో గుండె పోటుతో మృతి చెందడం కలచివేసింది. తెలంగాణ ఉద్యమ సహచరుడు, అత్యంత సన్నిహితుడు ఇకలేడనే బాధ కలచివేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. జగదీశ్వర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
– దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్
ఉద్యమ వీరుడికి జోహార్లు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో సహచర ఉద్యమకారుడు, కుసుమ జగదీశ్వర్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి, ములుగు జిల్లా ప్రజలకు తీరని లోటు. ఓ మంచి మిత్రుడిని కోల్పోయాను. జగదీశ్వర్ మృతికి సంతాపం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
– వై.సతీష్రెడ్డి, టీఎస్ రెడ్కో చైర్మన్
పార్టీకి తీరని లోటు..
ములుగు జెడ్పీ చైర్మన్ జగదీశ్వర్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడి మరణం ఎంతగానో కలచివేసింది. సహచర జెడ్పీ చైర్మన్గా ఎన్నో ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునేవారం. ఆయన మృతికి సంతాపం.
– డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్,
వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్
జెడ్పీ చైర్మన్ జగదీశ్ హఠాన్మరణం
తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
సంతాపం తెలిపిన ప్రజాప్రతినిధులు

కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న ఎమ్మెల్యే సీతక్క

జగదీశ్ మృతదేహం