నేటి నుంచి భూ భారతి సదస్సులు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి భూ భారతి సదస్సులు

Jun 3 2025 6:53 AM | Updated on Jun 3 2025 6:53 AM

నేటి

నేటి నుంచి భూ భారతి సదస్సులు

వనపర్తి: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో మంగళవారం నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలంలో సంబంధిత అధికారులతో రెండు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక్కో బృందం ఒక్కో జీపీలో భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు షెడ్యూల్‌ వారీగా నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం

వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌ కె.రమేశ్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సీట్ల భర్తీ నిమిత్తం మొదటి విడత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 79953 35372, 98492 44030 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు

పాన్‌గల్‌: పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపొందుతుందని ఐఐఓఆర్‌, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అనిల్‌కుమార్‌, భవాని అన్నారు. వికసిత్‌ కృషి సంకల్ప అభియాన్‌లో భాగంగా సోమవారం పాన్‌గల్‌, దొండాయిపల్లి రైతువేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటల సాగులో రసాయన ఎరువులు, యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. సాగునీటి పొదుపు, నాణ్యమైన విత్తనాల ఎంపికపై సూచనలు చేశారు. వరి, ఇతర పంటల కోతల అనంతరం కొయ్యలను తగలబెట్టడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్‌, ఏఓ రాజవర్ధన్‌రెడ్డి, ఏఈఓలు నరేశ్‌, వెంకటేశ్‌, షర్మిళ, అఖిల పాల్గొన్నారు.

పోరాటాలతోనేహక్కుల సాధన

వనపర్తి రూరల్‌: పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. కార్మికుల హక్కులను సాధించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంగన్‌వాడీల పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించడంతో పాటు రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 9న నిర్వహించ తలపెట్టిన అఖిలభారత సార్వత్రిక సమ్మెలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, నాయకులు బొబ్బిలి నిక్సన్‌, ఆర్‌ఎన్‌ రమేశ్‌, నారాయణమ్మ, జ్యోతి, సుమతి, విజయ, రేణుక, మహేశ్వరి, నిర్మల, సత్యమ్మ, విజయలక్ష్మి, వసంత, శారద, కవిత తదితరులు ఉన్నారు.

నేటి నుంచి భూ భారతి సదస్సులు 
1
1/1

నేటి నుంచి భూ భారతి సదస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement