
మత్తుపదార్థాలకు బానిసలు కావద్దు
విజయనగరం క్రైమ్: మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, బంగారంలాంటి జీవితాన్ని ఏ ఒక్కరూ నాశనం చేసుకోవద్దని విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా విజయనగరం రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పోలీస్శాఖ గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రంలో సాగుచేస్తున్న గంజాయి జిల్లా మీదుగా ఏడాది పొడవునా అక్రమ రవాణా సాగుతోందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమంగా పండిస్తున్న గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టామన్నారు. 500 ఎకరాల్లో విస్తరించిన గంజాయి తోటలను ధ్వంసం చేశామన్నారు. డీఐజీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ డ్రగ్స్కు యువత అలవాటు పడవొద్దని, క్షణికానందానికి లోనుకావద్దని కోరారు. కలిసికట్టుగా పనిచేస్తే గంజాయి రవాణా, వినియోగాన్ని అరికట్టవచ్చని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టామని, యువతలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా సంకల్ప సభలు నిర్వహించినట్టు వెల్లడించారు. కార్యక్రమం అనంతరం కళాశాలల విద్యార్థులతో వేదికపై ఉన్న అధికారులందరూ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రింగ్ రోడ్డు నుంచి ఐస్ ఫ్యాక్టరీ, ఆయోధ్య మైదానం, సంస్కృత కళాశాల, సింహాచలం మేడ, కోట వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కోటవద్ద దాదాపు 40 నిమిషాల పాటు కళాశాలల విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయంటూ నృత్య రూపకం ప్రదర్శించారు. కార్యక్రమాన్ని డీఐజీ, కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి తిలకించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, సహకార బ్యాంకు చైర్మన్ గొంప కృష్ణ, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు స్వప్నహైందవి, డాక్టర్ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాస్, కాంతారావు, సీఐలు లక్ష్మణరావు, శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
అంతర్జాతీయ మాదకద్రవ్యాల
అక్రమరవాణా దినోత్సవంలో
విశాఖరేంజ్ డీఐజీ పిలుపు

మత్తుపదార్థాలకు బానిసలు కావద్దు