అన్నార్తులకు ఆసరా | - | Sakshi
Sakshi News home page

అన్నార్తులకు ఆసరా

Jun 13 2025 4:40 AM | Updated on Jun 13 2025 4:40 AM

అన్నార్తులకు ఆసరా

అన్నార్తులకు ఆసరా

గరుగుబిల్లి: ఏ ఆధారం లేని నిరుపేదలు కడుపారా రెండుపూటలా తినేందుకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఓ మంచి కార్యక్రమానికి గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు శ్రీకారం చుట్టారు. వృద్ధాప్యంలో వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి అవకాశం లేని వారిని గుర్తించి వారి వద్దకు నేరుగా క్యారియర్లతో రెండుపూటలా భోజనం సరఫరా చేసేందుకు శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా కేంద్రం ద్వారా చర్యలు చేపట్టారు. ఈ మేరకు గురువారం గరుగుబిల్లి మండలంలోని నాగూరు గ్రామంలో క్యారియర్ల ద్వారా భోజనం సరఫరా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరఘట్టం, రావివలస, చిట్టపులివలస, కెల్ల తదితర దాదాపు పది గ్రామాల్లో గత కొన్నేళ్లుగా క్యారియర్ల ద్వారా అనార్తులకు భోజనం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నాగూరులో 12 మందిని గుర్తించి వారికి కూడా ప్రతిరోజూ క్యారియర్ల ద్వారా భోజనం సరఫరా చేయనున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకే ఆహారాన్ని చిట్టపులివలసలో ఉన్న సత్యసాయి అన్నపూర్ణ సేవా కేంద్రంలో తయారు చేసి మినీ వాహనం ద్వారా తమ సిబ్బంది అన్నార్తులకు నేరుగా క్యారియర్లను అందిస్తారని తెలిపారు. ఇక్కడితో ఆగకుండా మరికొద్ది రోజుల్లో గరుగుబిల్లి మండలంలోని దత్తివలస, కారివలస, చిలకాం గ్రామాలకు కూడా ఆహారాన్ని క్యారియర్‌ల ద్వారా సరఫరాచేయనున్నట్లు తెలిపారు.

దాతల సహకారం

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి పలువురు దాతలు ముందుకొచ్చి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా కేతిరెడ్డి గాయత్రినాయుడు జ్ఞాపకార్థం ఆయన భార్య రాధాకాంతమ్మ రూ. 2లక్షలు, గురజాడ సంస్థల అధినేత రూ.2లక్షలు, అక్కేన సత్యనారాయణ జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు అంబటి తిరుమల రావు రూ.లక్ష, ఎల్లాపు కాశీవిశ్వనాథ తన తండ్రి జ్ఞాపకార్ధం రూ.లక్ష, అమెరికాలో ఉంటున్న విమలాకర్‌, సరళ దతాని ఫౌండేషన్‌ ద్వారా రూ.లక్ష, తిరుమల తన తండ్రి జగన్నాథం జ్ఞాపకార్ధం రూ.50వేలు ఆర్థిక సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నఖచిత్రకారుడు పల్ల పరిశి నాయుడు వేసిన నఖ చిత్రమాల పుస్తకాన్ని గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ.స్వామినాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా రిమ్స్‌ సేవా సంస్థల ప్రతినిధి రమణబాబు, విశ్రాంత ఏఎస్పీ కె. భార్గవ నాయుడు, ఆధ్యాత్మిక గురువు వైఆర్‌వీ గణపతిరావు, సీతంనాయడు, బొత్స తవిటినాయుడు, మిరియాల సత్యనారాయణ, కేతిరెడ్డి శ్రీను, రిటైర్డ్‌ ఎస్‌ఈ కె.చంద్రశేఖరరావు, కొప్పల వెలమ సంఘం డైరెక్టర్‌ ఎ.మధుసూధనరావు, బి. తాతబాబు, తదితరులు పాల్గొన్నారు.

రోజూ క్యారియర్లతో భోజనం సరఫరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement