
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంపై అవగాహన
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం బాలాజీ మార్కెట్ ఆవరణలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్ట గడవక జీవనోపాధి కోసం కష్టపడే వారిని కార్మికులంటారు. చదువుకోవాల్సిన బాల్యంలో బలమైన పనులు చేస్తున్న దుస్థితి దాపరించడం నిజంగా అందరూ ఖండించాల్సిన విషయమన్నారు. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ప్రపంచంలో ఐదు సంవత్సరాల నుంచి 14 ఏళ్ల లోపు బాల కార్మికులు 20 కోట్ల మంది ఉన్నారని అందులో సగం మంది భారతదేశంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. బాలకార్మిక నిషేధ, నియంత్రణ చట్టం 1986 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు బాలబాలికలతో దుకాణాల్లో పనిచేయించుకున్నట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. బాల కార్మికులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి స్కూల్కు పంపే ప్రయత్నం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జి.హిమబిందు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బీహెచ్ లక్ష్మి, జిల్లా కన్వీనర్ చైల్డ్ రైట్స్ ఫోరం చిట్టిబాబు, న్యాయవాది తాడి రాజు, బెజ్జిపురం యూత్ ఆర్గనైజేషన్ ఎన్జీవో కోఆర్డినేటర్ ఝాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా బాలబాలికల హక్కుల ఫోరం కన్వీనర్ చిట్టి బాబు ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు.