
వచ్చే నెల 5న జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: వచ్చే నెల 5వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్కు సంబంధించి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా కోర్టు సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రాజీ కాదగిన అన్ని క్రిమినల్ కేసులతో పాటు చెక్బౌన్స్ కేసులను గుర్తించి స్పెషల్ డ్రైవ్ చేపట్టి జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవా లని సూచించారు. తద్వారా కక్షిదారులకు డబ్బు సమయం వృథా కావన్నారు. పోలీస్ అధికారులు వారెంట్ పెండింగ్ ఉన్న కేసులు, గంజాయికి సంబంధించిన కేసులు, పోక్సో యాక్ట్కు సంబంధించిన కేసులలో నిందితులకు అవగాహన కల్పించాలని, తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయ పడ్డారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి బుజ్జి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 80 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి పిలుపు