
మెట్టవలసలో డీఎంఓ పర్యటన
రామభద్రపురం: మండలంలోని జన్నివలస పంచాయతీ పరిధి మెట్టవలస గిరిజన గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థికి కుడుమూరు మేఘన(14) ఈనెల 9వ తేదీ రాత్రి విషజ్వరంతో మృతిచెందిన సంఘటన తెలిసిందే. అయితే ఈ విషయాన్ని విషజ్వరంతో గిరిజన విద్యార్ధిని మృతి శీర్షికన ఈ నెల 11న సాక్షి వార్త ప్రచురించింది. ఈ వార్తకు స్పందించిన డీఎండ్హెచ్వో మెట్ట్వలస గ్రామాన్ని సందర్శించి మేఘన మృతికి గల కారణాలతో పాటు అక్కడ వైద్యశిబిరం నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారిణి వై.మణిని ఆదేశించారు. దీంతో ఆమె బుధవారం మెట్టవలస గిరి జన గ్రామాన్ని సందర్శించి మృతిచెందిన గిరిజన విద్యార్థిని తల్లిదండ్రులు సూర్యనారాయణ,సంధ్యలను పరామర్శించారు.అలాగే మేఘన ఎలా మృతిచెందింది? మృతికి గల కారణాలేంటి? ఎన్ని రోజులు జ్వరం వచ్చింది? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతురాలి కుటుంబసభ్యులతో పాటు వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఒకరిద్దరికి వైరల్ జ్వరాలు ఉండడంతో వారికి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామంలోని పరిసరాలను పరిశీలించారు.సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామప్రజలకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ ఎన్.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

మెట్టవలసలో డీఎంఓ పర్యటన