
అడ్డగోలు అవిశ్వాసం సంపూర్ణం
బొబ్బిలి: టీడీపీ నాయకులు పదవీ కాంక్షతో చేపట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇప్పటికే వైఎస్సార్సీపీకి పజలు కట్టబెట్టిన మున్సిపల్ చైర్మన్ పదవిని కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్న టీడీపీ నాయకులు వైస్చైర్మన్ పదవిని కూడా అదే అవిశ్వాసంతో రాజకీయం చేసి తమ వైపు తిప్పుకున్నారు. దీంతో అడ్డగోలు అవిశ్వాసం పూర్తయినట్లయింది. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహన రావు ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో అవిశ్వాసం తీర్మాన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ముందుగా కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని, ఇందుకు అనుకూలంగా చేతులెత్తాలని ఆర్డీఓ రామమోహన రావు కోరారు. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే బేబీ నాయన చేతులెత్తడంతో మూడవ వంతు కౌన్సిలర్లు (22మంది) చేతులెత్తారు. వారితో పాటు వైఎస్సార్సీపీకి చెందిన రెండో వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ కూడా చేతులెత్తడంతో సంఖ్యాపరంగా సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఆర్డీఓ ధ్రువీకరించారు. అనంతరం వారితో సంతకాలు చేయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. కాగా ఈ అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాలేదు. వారంతా వైఎస్సార్సీపీ కార్యాలయంలోనే ఉండిపోయారు.