
ఆండ్ర ఎస్సైకి ఎస్పీ ప్రశంసలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధి బిరసాడవలన గ్రామసమీపంలోని గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలను ఆండ్ర ఎస్సై కె.సీతారామ్ కాపాడారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అనంతరగిరి మండలం రొంపల్లి పంచాయతీ గూడెంకు చెందిన గెమ్మెల రాంబాబు, గెమ్మెల అప్పలస్వామిలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు డయల్ 100, 112 నంబర్కు సమాచారం ఇవ్వగా సకాలంలో ఎస్సై సీతారాం స్పందించి ఘటనా స్థలికి చేరుకుని, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని 108 సిబ్బంది సహకారంతో అంబులెన్స్లో ముందుగా గజపతినగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆ ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను స్పెషల్ బ్రాంచ్ ద్వారా తెలుసుకున్న ఎస్పీ వకుల్ జిందల్ ఆండ్ర ఎస్సై సీతారాంను అభినందించారు.