● ఉన్నవారిని తీసేసి.. కొత్తవారికి పోస్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

● ఉన్నవారిని తీసేసి.. కొత్తవారికి పోస్టింగ్‌

Jun 12 2025 2:58 AM | Updated on Jun 12 2025 2:58 AM

● ఉన్

● ఉన్నవారిని తీసేసి.. కొత్తవారికి పోస్టింగ్‌

కూటమి నాయకులు తమ కార్యకర్తలకు ఉపాధి స్థావరాలుగా ప్రభుత్వసేవలను మార్చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన ఏళ్ల నుంచి పని చేస్తున్న వారిని తొలగించి, ఆ స్థానంలో తమవారిని నియమించుకునేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగానే పశు సంచార వైద్యసేవ ఉద్యోగులను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారు. రాష్ట్రంలో 2022లో సంచార పశు ఆరోగ్య సేవ పథకం ప్రారంభించింది. అప్పటి నుంచి జీవీకేఈఎంఆర్‌ఐ సంస్థ ఈ పథకాన్ని ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తోంది. గత ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఆ సంస్థే నిర్వహించింది. ఈ ఏడాది మే 1 నుంచి భవ్య హెల్త్‌ సర్వీసెస్‌ సంస్థ నిర్వహించడానికి ప్రస్తుత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పాత సంస్థలో పనిచేసిన సిబ్బందిని కొనసాగించాల్సి ఉన్నప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సదరు సంస్థ పూనుకుంది.

తొలుత సంచార పశువైద్యసేవలకు మంగళం

రైతుల తిరుగుబాటుతో పునఃప్రారంభం

నిర్వహణ బాధ్యతలు మరో సంస్థకు అప్పగింత

గతంలో పనిచేసిన ఉద్యోగులను కాదని, కొత్తవారి నియామకానికి సన్నాహాలు

ఇప్పటికే నలుగురు ఉద్యోగుల తొలగింపు

తొలగించిన వారిలో ముగ్గురు మంత్రి నియోజకవర్గానికి చెందిన వారే..

ఆందోళనలో సంచార పశువైద్యసేవ సిబ్బంది

విజయనగరం ఫోర్ట్‌:

ధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3వేలు అందజేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీల వర్షం కురిపించారు. నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌, కేజీబీవీలో పనిచేసే కుక్‌లు, వాచ్‌మన్‌లు, ఆయాలు, భోజన నిర్వాహకులు, వెలుగులో పనిచేసే వీఓఏలను తొలిగించారు. తాజాగా సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేసే ఉద్యోగుల మెడపై తొలగింపుల కత్తి పెట్టారు. వారిని ఒక్కసారిగా తొలగిస్తే ఉద్యమం చేస్తారని విడతలు వారీగా తొలగిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని విధులకు రావొద్దని చెప్పారు. ఆ నలుగురిలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గానికి చెందిన వారే ముగ్గురు కావడం గమనార్హం. ఉన్న ఫళంగా తీసేయడంతో చిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ వయసులో ఏ ఉద్యోగం వెతుక్కోవాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తొలగింపులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదే పనిగా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థలకు మంగళం పాడటం.. లేకుంటే అందులో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. పశువులకు పాడి రైతుల ఇంటి వద్దే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంచార పశు ఆరోగ్య సేవలను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ వాహనంలో డాక్టర్‌, సహాయకులు, డ్రైవర్‌ చొప్పున ముగ్గురు సిబ్బంది ఉంటారు. పశువులకు సంబంధించిన అన్ని మందులూ ఉంటాయి. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున సంచార వైద్య సేవల వాహనాలను నాటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు 13 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అనతికాలంలోనే ప్రతి రైతు ముంగిట ఈ సేవలు గుర్తింపు పొందాయి. సంచార వాహన నిర్వహణను ఏజెన్సీకి అప్పగించగా... కూటమి ప్రభుత్వం వచ్చాక, ఈ సేవలను తగ్గిస్తూ వస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకూ వైద్యసేవలను నిలిపివేసింది. ఇప్పుడు మరలా ప్రారంభించినా.. అందులో పని చేస్తున్న ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీస్తోంది.

సేవలూ.. దినదిన గండమే!

ఏడాది క్రితం వరకు పశు సంచార వైద్యసేవలు సక్రమంగానే పాడిరైతులకు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు.. ఈ సేవలకు గ్రహణం పట్టుకుంది. గత ప్రభుత్వం ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 కింద వాహన సేవలను ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి ఫేజ్‌ 1 వాహనాల సేవలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. తర్వాత కొన్నాళ్లకు ఫేజ్‌ 2 సేవలనూ నిలుపు చేశారు. మళ్లీ నిర్వహణ సంస్థను మార్పు చేసి మే ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభించారు. వైద్యసేవలు ఎప్పుడు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లోపు వాహనం రావడంతో మెరుగైన వైద్య సేవలు సాధ్యమయ్యేవి. కూటమి ప్రభుత్వ వైఖరితో ఈ సేవలకూ గ్రహణం పట్టుకుందని పాడిరైతులు వాపో తున్నారు.

ఈ ఫొటోలో సంచార పశు ఆరోగ్య సేవ వాహనం వద్ద ఉన్న వ్యక్తిపేరు సాయి సతీష్‌. గజపతినగరం సంచార పశు ఆరోగ్యసేవ వాహనం డ్రైవర్‌గా 2022 డిసెంబర్‌ నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనిని బుధవారం నుంచి విధులకు రావద్దని కొత్తగా నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన భవ్య హెల్త్‌ సర్వీసెస్‌ సంస్థ అధికారి ఫోన్‌ చేసి చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే ఉన్నత అధికారులు నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకనేనని చెప్పారట. దీంతో ఆయన దిక్కు తోచని స్థితిలో పడ్డాడు.

ఈ ఫొటోలో సంచార పశు ఆరోగ్య సేవ వాహనం వద్ద కనిపిస్తున్న ఉద్యోగి పేరు రెడ్డి నరేష్‌. ఇతను గంట్యాడ సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలో 2022 మే నెల నుంచి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనను కూడా బుధవారం నుంచి విధుల్లోకి రావద్దని చెప్పేశారు. వీరు ఇద్దరే కాదు. గంట్యాడ వాహనంలో పనిచేసే పారావెట్‌ను, బొబ్బిలి వాహనంలో పనిచేసే డ్రైవర్‌ను కూడా నిలిపివేశారు.

● ఉన్నవారిని తీసేసి..     కొత్తవారికి పోస్టింగ్‌  1
1/2

● ఉన్నవారిని తీసేసి.. కొత్తవారికి పోస్టింగ్‌

● ఉన్నవారిని తీసేసి..     కొత్తవారికి పోస్టింగ్‌  2
2/2

● ఉన్నవారిని తీసేసి.. కొత్తవారికి పోస్టింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement