
నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు డిమాండ్
● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రేపు ర్యాలీ
విజయనగరం: వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుల సూచనలతో ఈ నెల 13న నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అల్లు అవినాష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక పోలీస్ బ్యారెక్స్ కూడలి నుంచి నెహ్రూ యువకేంద్రం, జ్యోతిరావు పూలే విగ్రహం మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు, చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని వెంటనే ఇచ్చేలా ప్రభుత్వానికి సూచించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమానికి విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.
అర్ధరాత్రి వరకు ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్
● తొలిరోజు 500 మందికి బదిలీ
విజయనగరం అర్బన్: జిల్లాలో బుధవారం ప్రారంభమైన సెకెండరీ గ్రేడ్ టీచర్ కౌన్సెలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. తొలుత ఉదయం 400 మంది, మధ్యాహ్నం 400 మంది చొప్పున మొత్తం 800 మందికి నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. ఆ మేరకు ఉపాధ్యాయులకు మెసేజ్ ఇవ్వడంతో వారంతా హజరయ్యారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియలో స్పౌజ్ కేటగిరీలోని ఉపాధ్యాయులకు ప్లేస్ల కేటాయింపులో జాప్యం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు కేవలం 250 మందికి మాత్రమే కౌన్సెలింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన 800 మందికి కౌన్సెలింగ్ నిర్వహణ సాధ్యం కాదని, కేవలం 500 మందికే నిర్వహిస్తామని డీఈఓ యూ.మాణిక్యంనాయుడు ప్రకటించారు. గురువారం సీరియల్ నంబర్ 501 నుంచి నిర్వహిస్తామని తెలిపారు. దీంతో 800 మందిలో మిగిలిన టీచర్లంతా వెనుతిరిగారు. బదిలీ మాన్యువల్ కౌన్సెలింగ్ హాల్లోకి ఉపాధ్యాయ సంఘాలకు అనుమతి నిరాకరించడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సభ్యులు వ్యతిరేకించారు. సందేహాలు వస్తే నివృతిచేసేందుకు సంఘాల సభ్యులు అందుబాటులో ఉండాలంటూ విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదు.