
రైతన్నకు సేవలు దూరం
విజయనగరం ఫోర్ట్: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతు ముంగిటకే సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల(రైతు సేవా కేంద్రాలు)ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు. విత్తు దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు అన్ని సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడే అందించేవారు. దీంతో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటివి కొనుగోలు చేయడానికి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి తప్పింది. రైతులే తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పురుగు మందులు ఇండెంట్ పెట్టుకునే విధంగా ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ కియోస్క్లను ఏర్పాటు చేశారు. దీంతో రైతులకు వారి గ్రామాల్లోనే సేవలు అందడంతో ఎంతో సంతోషించేవారు.
జగన్మోహన్ రెడ్డి పాలన చెరిపేసేలా చర్యలు
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. అన్ని సేవలు ఒకే చోట అందడంతో అన్నదాతలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన ముద్రను చెరిపేసే విధంగా ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ విమర్శలకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చేసింది. ఇప్పడు ఏకంగా రేషనలైజేషన్ పేరుతో రైతు భరోసా కేంద్రాలను కుదించేస్తోంది. ఉన్న సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తోంది. ఒక వైపు ఖాళీ పోస్టులు భర్తీ కాకపోగా, ఉన్న పోస్టులను సర్దుబాటు చేయడంతో కర్షకులకు కష్టాలు రెట్టింపు కానున్నాయి.
జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 396
జిల్లాలో 396 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 10 అర్బన్ రైతు భరోసా కేంద్రాలు కాగా 386 గ్రామీణ ప్రాంత రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 383 మంది సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్యను 357కు తగ్గించేసింది. 26 మంది సిబ్బంది తగ్గిపోయారు. 242 మంది గ్రామ వ్యవసాయ సహాయకులకు గాను 223 మందికి తగ్గించేశారు. గ్రామ ఉద్యాన సహాయకులు 79మందికి గాను 72కు తగ్గించేశారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా అందే సేవలు
రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు ఉండేవారు.
రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ
ఈక్రాప్ బుకింగ్కు రైతు డేటాను ఆప్లోడ్ చేయడం
పంట సాగుదారుల హక్కు ధ్రువీకరణ పత్రం జారీ, విత్తన సేకరణ కార్యకలాపాలు పీఎం కిసాన్, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ వంటి పంట రుణాల కోసం డేటాను ఆప్లోడ్ చేయడం పొలంబడి,, సీడ్ విలేజ్ ప్రోగ్రాం, మినీకిట్ ట్రయల్ ఫ్లాట్లు, మొదలైన ఫ్లాగ్ షిప్ పోగ్రాంల నిర్వహణ
పొలం బడి పద్ధతి ప్రదర్శనలు
స్మార్ట్ టీవీ ద్వారా క్రాప్ నిపుణులతో సాంకేతిక స్టేషన్ల చిరునామా ప్రత్యక్ష ప్రసారం వివిధ పథకాల కింద లబ్ధిదారుల సామాజిక తనిఖీ డిజిటల్ లైబ్రరీ ద్వారా తెగుళ్లు, వ్యాధులపై అవగాహన కల్పించడం
పశు ఆరోగ్య కార్డుల జారీ
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, జంతువుల ప్రథమ చికిత్స ఈక్రాప్ బుకింగ్ ద్వారా పశుగ్రాసం అవసరాన్ని లెక్కించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు.
రేషనలైజేషన్ పేరుతో రైతు సేవా
కేంద్రాల కుదింపు
జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన
సహాయకుల తగ్గింపు
రేషనలైజేషన్ పూర్తి
రేషనలైజేషన్ పక్రియ పూర్తయింది. ఆ వివరాలను ఉన్నతా ధికారులకు పంపించాం. దానికి అనుగుణంగా సిబ్బందిని కేటాయించనున్నాం.
వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి