
సైబర్ నేరాల ఛేదనకు దర్యాప్తు ముమ్మరం
విజయనగరం క్రైమ్: జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన సైబర్ కేసులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు.సైబర్ నేరాలను ఛేదించేందుకు దర్యాప్తును వేగవంతం చేయాలని, కేసుల మిస్టరీని ఛేదించి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల ఛేదనకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని దర్యాప్తు అధికారులు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాల్లో బాధితులు ఏ తరహాలో మోసపోయింది? ఆయా కేసుల్లో ఇప్పటివరకు సంబంధిత దర్యాప్తు అధికారులు చేపట్టిన దర్యాప్తు, తీసుకున్న చర్యలను అధికారులను అడిగి అదనపు ఎస్పీ తెలుసుకున్నారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే బాధితులు సంప్రదించి, సకాలంలో 1930కు ఫిర్యాదు చేసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన తరువాత బాధితుల నగదు ఎవరి బ్యాంకు ఖాతాకు బదిలీ జరిగింది? ఎక్కడ, ఎవరు ఆయా నగదును విత్ డ్రా చేశారన్న వివరాలను సాధ్యమైనంత వేగంగా రాబట్టాలన్నారు. అనంతరం, ఆయా బ్యాంకు ఖాతాల నుంచి నిందితులు నగదు విత్ డ్రా చేయకుండా ఫ్రీజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఫ్రీజ్ అయిన నగదు కోర్టు అనుమతితో బాధితుల బ్యాంకు ఖాతాకు జమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. మోసగాళ్ల ప్రలోభాలకు లొంగవద్దని, ఓటీపీలను ఎవరికీ షేర్ చేయకుండా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీఐలు బి.సుధాకర్, బి.శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, శంకరరావు, ఎల్.అప్పల నాయుడు, కె.నారాయణరావు, జి.రామకృష్ణ, కె.దుర్గా ప్రసాద్, షణ్ముఖరావు, ఎ.అశోక్ కుమార్, వి.నారాయణమూర్తి, ఎస్సైలు నజీమా బేగం, రమేష్ కుమార్, షేక్ శంకర్, కె.కిరణ్ కుమార్ నాయుడు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏఎస్పీ సౌమ్యలత సమీక్ష