
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
పార్వతీపురం: విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ సాధ్యమని పార్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదర్రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఆధ్వర్యంలో నిర్వహించిన లీగల్ సర్వీసెస్ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీంలో భాగంగా మండల విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చదువుపట్ల విద్యార్థుల్లో ఆశక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. బడికి రాని పిల్లను గుర్తించి బడిలో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, చదువుకు జాతి, లింగం, భాష, మతంతో సంబంధంలేకుండా పిల్లలును మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఆరోగ్యకరమైన పరిస్థితులలో పెరిగేలా వ్యవస్థను రూపొందించాలని పేర్కొన్నారు. పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తూ సక్రమంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో లోక్అదాలత్ సభ్యుడు టి.జోగారావు, ఏజీపీ బి.సత్యనారాయణ, న్యాయవాది ఎం.వెంకటరామణ, పార్వతీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదర్రావు