
అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం
● జేసీ సేతు మాధవన్
● పీజీఆర్ఎస్కు 153 వినతులు
విజయనగరం అర్బన్: సమస్యలతో వచ్చి పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించే అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతులు రీ ఓపెన్ కాకుండా పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డీపీఓ టి.వెంకటేశ్వర్రావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బిశాంతి పాల్గొని వివిధ శాఖలకు సంబంధించి 153 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్సెల్కు 41 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించి 41ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫిర్యాదు దారుల ముందే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి సమస్యలను వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఎస్పీ 41 ఫిర్యాదులను స్వీకరించగా వాటిలో భూతగాదాలకు సంబంధించి 13, కుటుంబ కలహాలకు సంబంధించి 9, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించి 14 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆక్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.

అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం