
అనుమతి లేని విద్యాసంస్థల బోర్డులు తొలగించాలి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విద్యాసంస్థల బోర్డులను విద్యా శాఖాధికారులు తొలగించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.వెంకీ, జె.రవికుమార్ మాట్లాడుతూ..మరో 4 నాలుగు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని, కానీ విద్య పేరుతో వ్యాపారం ముందే మొదలైపోయిందని విమర్మించారు. రాజాం మండలంలో ఉన్న అభ్యాస్ పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేకపోయినా ఇంటర్నేషనల్ అనే బోర్డు ఏర్పాటు చేశారని, ఆ విధంగా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజాం మండలంలోనే ఉన్న నారాయణ కార్పొరేట్ పాఠశాలల్లో కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ–టెక్నిక్ బోర్డు ఏర్పాటు చేసి ఆ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విజయనగరం పట్టణంలో గల ఆదిత్య జూనియర్ కళాశాలకు అనుమతులు లేకున్నా, కాకినాడ ఆదిత్య పేరు పెట్టారన్నారు. ఇలా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్డుల పేరుతో ఆ విద్యా సంస్ధలు పెద్ద ఎత్తున తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. తక్షణమే జిల్లా విద్యా శాఖాధికారులు ఇలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకుని బోర్డులను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరిగే తాము చేపట్టే ఆందోళనకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేసీని కలిసిన వారులో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి.రమేష్, ఎస్.సమీర తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జేసీకి
వినతిపత్రం