
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు హుండీల ఆదాయాన్ని స్థానిక శివాలయం వీధిలో ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి కల్యాణ మంటపంలో సోమవారం లెక్కించారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 75 రోజులకు గాను చదురుగుడి హుండీల నుంచి రూ.29 లక్షల 38వేల 935 నగదు, 20 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, 541 గ్రాముల వెండి లభించాయన్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి హుండీల నుంచి రూ.6 లక్షల 92వేల 729 నగదు, 1 గ్రాము.400మిల్లీగ్రాముల బంగారం, 49 గ్రాముల వెండి లభించాయన్నారు. వీటితో పాటు అన్నదానానికి సంబంధించి రూ.16వేల12 ఆదాయం ద్వారా లభించిందన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణ అధికారులుగా గ్రేడ్–1 ఈఓ బి.శ్రీనివాసరావు, బొబ్బిలి ఇన్స్పెక్టర్ ఎన్.రాజకుమారి, శ్రీవారి సేవకులు, ఆలయసిబ్బంది పాల్గొన్నారు.