
కార్పొరేటు ప్రతిభకు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రభుత్వ విద్యను పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేస్తుందనే అనుమానాలు సర్వత్రా తలెత్తుతున్నాయి. ఎందుకంటే గత వైఎస్సార్సీపీ హయాంలో విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల పుణ్యమాని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఒకానొక దశలో కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయి. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లింది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. అమ్మ ఒడితో ప్రతి ఒక్క విద్యార్థి చదివేలా ప్రణాళిక రచించింది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచింది. ట్యాబ్లు అందజేసింది. ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇవన్నీ గత వైభవాలు...కానీ కూటమి పాలకులు వచ్చాక ప్రభుత్వ విద్యను పూర్తిగా నీరుగార్చేస్తున్నారు. నాడు – నేడును పూర్తిగా మరిచారు. రెండో విడత పాఠశాలల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలల స్థాయిని విభజించి మరింత నిర్యీర్యం చేసింది. తాజాగా ప్రతిభా పురస్కారాల పేరిట తెచ్చిన షైనింగ్ స్టార్స్తో కార్పొరేట్కే పట్టం కట్టేలా కూటమి ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా కొన్ని చోట్ల పురస్కారాలు రాని పరిస్థితి నెలకొంది.
● ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ప్రైవేటు విద్యకు ప్రోత్సాహం ● ప్రతిభ చూపిన పది, ఇంటర్ విద్యార్థులకు రూ.20 వేల నగదు పురస్కారాలు ● కులాల కేటగిరి వారీగా మండల స్థాయిలో ప్రతిభ ఎంపిక ● మండలానికి ఆరుగురు వంతున పదో తరగతికి 158 మంది, ఇంటర్లో గ్రూప్కి ఆరుగురు వంతున 40 మంది ఎంపిక ● అధిక మార్కులు సాధించినప్పటికీ 3 మండలాల్లో ఎంపిక కాని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ● ఇంటర్లో ఎంపికై న 40 మందిలో 29 మంది ప్రైవేటు విద్యార్ధులే..
ఇంటర్లో 40 మందికి
29 మంది ప్రైవేటు విద్యార్థులే..
జిల్లాలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరికి కూడా ఒక్కొక్కరికీ రూ.20 వేల వంతున నగదు బహుమతితో పురస్కారాన్ని అందజేస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్ల నుంచి ఒక్కో గ్రూపులో బీసీ, జనరల్, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరికి ఒక్కరు వంతున అధిక మార్కులు సాధించిన మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. అయితే వారిలో కేవలం 11 (ఎస్సీ, ఎస్టీ) మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. మిగిలిన 29 మంది కార్పొరేట్ కళాశాలల విద్యార్థులే ఉండడం విశేషం.
విజయనగరం అర్బన్:
ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రోత్సహించే దిశ గా ఎక్కడైనా పాలకులు తమ పాలన సాగించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మంచిగా చదివే వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగితే ఆయా కుటుంబాల్లో విద్యావంతులు తయారై కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీ పడే అవకాశం ఉంటుంది. గత వైఎస్సార్సీపీ హయాంలో ఇటువంటి లక్ష్యంతోనే విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నగదు బహుమతులతో ప్రతిభా పురస్కారాలను అందజేసి వారిని ప్రోత్సహించింది. ఈ పురస్కారాల ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే అందజేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం కూడా షైనింగ్ స్టార్స్ పేరుతో నగదు పురస్కారాలను కొనసాగిస్తుంది. కానీ ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులను కూడా ఎంపిక చేసింది. ఇది కాస్త తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఈ నెల 9న జిల్లా కేంద్రాల్లో ఈ పురస్కారాలను అందజేయాలని విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ విధానం పూర్తిగా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేలా ఉందని విద్యావేత్తలు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు సామాన్యులు వ్యాఖ్యానిస్తున్నారు.
పదిలో 158 మంది విద్యార్థులకు
పురస్కారాలు
ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలో అధిక మార్కులు తెచ్చుకున్న జిల్లా స్థాయిలో 158 మంది విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ఒక్కొక్కరికీ రూ.20 వేలు నగదు బహుమతి పురస్కారాలను ప్రకటించింది. మండల స్థాయిలో అధిక మార్కులు (500 పైబడిన) సాధించిన నాలుగు కేటగిరీలలో ఆరుగురు వంతున 26 మండలాల నుంచి ఎంపిక చేశారు. ఓసీ, బీసీల నుంచి ఇద్దరేసి, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒకొక్కరిని, ఎస్టీలు లేని మండలాల సంఖ్య నుంచి అంగవైకల్యం (సీడబ్ల్యూఎస్) కేటగిరి నుంచి ఏడుగురితో మొత్తం 158 మందిని ఎంపిక చేశారు.
మూడు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక్కరూ లేరు..
జిల్లాలో ఎంపిక చేసిన పదో తరగతి 158 మంది షైనింగ్ స్టార్స్లో 65 మంది కార్పొరేట్/ప్రైవేటు విద్యా సంస్థలలో చదివిన వారే ఉండడం విశేషం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపిన మార్కులు సాధించినప్పటికీ జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రభావం ఉన్న మూడు మండలాల్లో ఒక్కరు కూడా పురస్కార జాబితాకి ఎంపిక కాలేదు. ఉదాహరణకు బొబ్బిలి మండలంలోని పక్కి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, కారాడా సంక్షేమ పాఠశాలలో 592 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు పురస్కారానికి ఎంపికలో అవకాశం లభించలేదు. లక్షల రూపాయలు వసూలు చేసిన మండల కేంద్రంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన ఆరుగురు ఒక్క మార్కు తేడాతో ఎంపిక జాబితాలో ఉన్నారు. జిల్లాలో విజయనగరం, రాజాం మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో ఆయా మండలాల్లో ప్రతిభ చూపిన పేద విద్యార్థులను ప్రోత్సహించలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 26 మండలాలలో ఏడు మినహా అన్ని మండలాలలో కార్పొరేట్, ప్రైవేటు విద్యార్థులు జాబితాలో ఉన్నారు. దత్తిరాజేరు, గుర్ల, మెంటాడ, నెల్లిమర్ల, రేగిడి ఆమదాలవలస, తెర్లాం, వేపాడ మండలాలో మాత్రమే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది.

కార్పొరేటు ప్రతిభకు

కార్పొరేటు ప్రతిభకు