
ఆర్టీసీ విజిలెన్స్ నూతన కమిటీ ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: ఏపీ ప్రజా రవాణా శాఖ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం ఆర్టీసీ జోన్ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సంఘం కార్యాలయంలో ఆదివారం ఎన్నిక జరిగింది. జోన్ నూతన కమిటీలోని విశాఖ జోనల్ అధ్యక్షుడుగా సీహెచ్ మోహన్రావు, కార్గో విశాఖపట్నం జోనల్ అధ్యక్షుడుగా టీఎస్ ప్రసాద్, విజయనగరం జోనల్ వర్క్షాప్ జోనల్ కార్యదర్శిగా డి.శ్యాంసుందరావు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్ టీవీ రావు, రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యులు ఎం.అనంతకుమార్, సీఎస్ఐ విశాఖ రీజియన్ సీహెచ్మోహనరావు సమక్షంలో ఎన్నిక జరిగింది.
అక్రమ సస్పెన్షన్లు మానుకోవాలి
● ఆర్టీసీ ఎన్ఎంయూ జోనల్ కమిటీ డిమాండ్
విజయనగరం అర్బన్: ఆర్టీసీలో ఉద్యోగులపై అధికారులు చేపడుతున్న అక్రమ సస్పెన్షన్లు మానుకోవాలని లేకపోతే ఉద్యమాలు తప్పవని ఆర్టీసీ ఎన్ఎంయూ విజయనగరం జోనల్ కమిటీ హెచ్చరించింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన సంఘం జోనల్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంస్థ క్రమశిక్షణ చర్యలపై జారీ చేసిన మార్గదర్శకాలపై 01/2019 సర్క్యులర్ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఉద్యోగులను ఇష్టారాజ్యంగా సస్పెన్షన్స్, తొల గించడం చేస్తుండడంపై న్యాయం కోరుతూ అనకాపల్లిలో 100 రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలపై అధికారులు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. విజయనగరం డిపో ఉద్యోగ, సంఘ నాయకులపై స్థానిక అధికారులు దుర్భాషలాడటంపై ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జోన్ పరిధిలోని అన్ని డిపోలలోనూ, గ్యారేజీలలోనూ ఇదే పద్ధతిలో అధికారుల తీరు ఉందని దీన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి పీవీ మోహన్, రాష్ట్ర కార్యదర్శి కె.నర్సింగరావు, జోనల్ కార్యదర్శి బీఎస్ రాములు, జిల్లా కార్యదర్శి పీజీ రాఫీల్, వివిధ డిపోల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
సువర్ణముఖి నది ఒడ్డున ఏనుగుల సంచారం
సీతానగరం: మండలంలోని లక్ష్మీపురం – ఏగోటివలస గ్రామాల మధ్యనున్న సువర్ణముఖి నది ఒడ్డున తోటల్లో ఏనుగులు ఆదివారం సంచరిస్తూ కనిపించాయి. శనివారం వెంకటాపురం – బూర్జ తోటల్లో సంచరించిన ఏనుగుల గుంపు ఆదివారం ఉదయానికి లక్ష్మీపురం పురవీధుల్లో కనిపించాయి. ఉదయం 10 గంటల తరువాత నది ఒడ్డుకు చేరాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గడిచిన మూడు రోజులుగా మండలంలోనే ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మరోవైపు పంట పొలాల వైపు సంచరించే సమయంలో తమ పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఆర్టీసీ విజిలెన్స్ నూతన కమిటీ ఏకగ్రీవం

ఆర్టీసీ విజిలెన్స్ నూతన కమిటీ ఏకగ్రీవం