
వివాహిత ఆత్మహత్యా యత్నం
వేపాడ: మండలంలోని వల్లంపూడి పోలీస్స్టేషన్ ఎదురుగా రోడ్డుపై పెట్రోలు పోసుకుని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చంచలనం రేకెత్తించింది. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలంలోని కాపు సోంపురానికి చెందిన రొంగలి లక్ష్మి కొంత కాలంగా భర్తకు దూరంగా తన ఇద్దరు పిల్లలతో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు కొంత కాలం క్రితం వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన ప్రస్తుతం వల్లంపూడిలో నివాసముంటున్న యోగుల కాళీతో పరిచయం ఏర్పడింది. కాళీ తన భార్య, ఇద్దరు పిల్లలతో వల్లంపూడిలో నివాసముంటున్నాడు. రొంగలి లక్ష్మి, కాళీల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొంతకాలంగా లక్ష్మి వద్దకు కాళీ వెళ్లకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఆదివారం వల్లంపూడి పోలీసులు కాళీతో పాటు లక్ష్మిని స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామపెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరం పొరపాటు చేశామని ఇద్దరికీ పిల్లలు ఉన్నందున ఇకపై ఎవరి బతుకులు వారు బతుకుదామంటూ కాళీ నచ్చచెప్పే ప్రయత్నం లక్ష్మికి చేశాడు. దీంతో కలత చెందిన ఆమె తనను నమ్మించి కాళీ మోసం చేశాడని ఈ జీవితం తనకు అవసరం లేదంటూ స్టేషన్ బయటకు పరుగెత్తి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఆమె శరీరంపై రగ్గు కప్పి లక్ష్మిని కాపాడి 108 వాహనంలో ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, లక్ష్మి ఇచ్చిన వాగ్మూలంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు.