
కేసుల నమోదు
విజయనగరం ఫోర్ట్: పేదలకు అందించాల్సిన పీడీఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న అంశంపై ‘మంత్రి ఇలాకాలో.. పేదల బియ్యం పక్కదారి’ అనే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన వార్తకు పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. పేదల బియ్యాన్ని పక్కదారిపట్టిస్తున్న వ్యక్తులపై 6ఏ కేసులతో పాటు, క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి కె.మధుసూదనరావు తెలిపారు. గొట్లాం గ్రామం నుంచి గజపతినగరం వైపు 10 క్వింటాల పీడీఎస్ బియ్యం తరలిస్తూ పట్టుబడిన ముప్పిడి గణేష్తో పాటు బొండపల్లి మండలం కిండాం ఆగ్రహారంలోని మామిడి తోటలో 43 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, కొండ కిండాం గ్రామంలోని కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం నిల్వ చేసిన సీమల వెంకటరమణ, కళ్ల వెంకటరావుపై 6ఏతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బియ్యంను కిండాం ఆగ్రహారం నుంచి విశాఖపట్నంలోని ఆనందపురం మండలానికి బండారు వెంకట ఎల్లాజీ అనే వ్యక్తి తరలిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఇతనిపై గతంలో 3 నుంచి 4 వరకు 6ఏ కేసులు నమోదుచేసి క్రిమినల్ కేసులు పెట్టామన్నారు.

కేసుల నమోదు